రామ తత్త్వము
రామాయణ కథానాయకుడైన రాముడెవరు. ఉత్తమ పురుషుడా లేక పురుషోత్తముడా. ఉత్తమ పురుషుడంటే పరమాత్మ. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మే త్యుదాహృత:- అని భగవద్గీతా వాక్యం, అలా కాక పురుషోత్తము డనుకొన్నామో, మానవులలోనే ఒకానొక ఉత్తముడైన మానవుడు. అందరికీ అదర్శప్రాయమైన వాడని అర్థం. మొదటి పక్షంలో సాక్షాత్తూ భగవంతుడే అవుతాడు రాముడు. రెండవ పక్షంలో సర్వశ్రేష్ఠుడైన మానవుడవుతాడు. ఇందులో ఎవడీ రాముడు. ఎవడనే ప్రశ్న అసలెందుకు వచ్చింది. దశావతారాలలో రాముడు కూడా ఒక అవతార విశేషమే ననిగదా పరిగణించారు పురాణాలలో. అలాంటప్పుడు మిగతా అవతారాల లాగ ఇదీ భగవంతుడే కావాలి గదా. వాటిలో దేనిలోనూ కలగని విచికిత్స ఇందులో మాత్రమే ఎందుకేర్పడింది. నిజమే. అలా ఏర్పడటానికి వీలులేదు. విభవాతారాలలో కృష్ణావతారమెంతో రామావతారమూ అలాంటిదే. పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృ తా మన్నట్టు దుష్టశిక్షణ శిష్ట రక్షణా చేసి విశ్వధర్మాన్ని స్థాపించటానికే గదా భగవంతుడు లోకంలో అవతరిస్తాడని చాటుతున్నది శాస్త్రం. అది కృష్ణుడూ చేశాడు. రాముడూ చేశాడు. ఇరువురూ దుష్టులైన రాక్షసులను సంహరించి శిష్టులైన ధర్మజ విభీషణాదులను కాపాడారు.
అంతే కాదు. అసలు జయ విజయుల వృత్తాంత మొక్కటి మనసుకు తెచ్చుకుంటే చాలు. విమర్శకులు చేసే అభియోగం ఎంత మాత్రమూ అర్థంలేనిదని తెలిసిపోతుంది. జయవిజయులు వైకుంఠ ద్వారపాలకులు. వారిని సనకసనందనాదులు శపించారు భూలోకంలో పోయి పుట్టండని.
Page 2