#


Index

  అప్పటినుంచీ రాముడిక సీతా లక్ష్మణులతో పాటు ఆ మహర్షి ఆశ్రమం ఈ మహర్షి ఆశ్రమం తిరుగుతూనే ఉంటాడు. మొదట అత్రిమహర్షిని దర్శిస్తారువారు. అక్కడ సీతకు అనసూయాదేవి దివ్యాలంకారాలు ప్రసాదిస్తుంది. ఆవలవారు దండకారణ్యం ప్రవేశిస్తారు. అక్కడ విరాధుడనే రాక్షసు డడ్డగిస్తాడు వారిని. వాడు తుంబురు డనే గంధర్వుడు. శాపగ్రస్తుడయి అలా జన్మించాడు. వాణ్ణి శపించిన కుబేరుడు రామదర్శనమైతే చాలునీకు శాపవిమోచన మవుతుందని చెబుతాడు. రాముడివల్ల ముక్తశాపుడయి వాడు శరభంగముని దగ్గరికి వెళ్లండని చెప్పి తిరోహితు డవుతాడు. మరి ఇలా విరాధుడు ఆయనచేతిలో శాపముక్తుడు కావాలన్నా శరభంగుడు ఆయనగారి దర్శనంచేసి తరించాలన్నా - అది భగవదవతారం కాకపోతే ఎలాగా. తత్ప్రయోజనార్థం రాజ్య పరిత్యాగం చేసి అరణ్యగమనం చేయకపోతే ఎలాగ. అందుకు నిదర్శనమే ఇదంతా. మరి ఆ తరువాత అక్కడి తాపసులంతా వచ్చి రాక్షసులవల్ల తమకుకలిగే ఉపద్రవాలు మనవి చేసి మమ్ములను కాపాడమంటే ఇలా అంటాడు రాముడు వారితో. భవతా మర్థసిద్ధ్యర్థమ్. ఆగతోహం యదృచ్ఛయా - తస్యమే యం వనవాసో - భవిష్యతి మహా ఫలః - మీ కార్యం సాధించటానికే నేనసలీ అరణ్యాలకు వచ్చాను. ఇక్కడ నా నివాసానికి తగినంత ఫలం తప్పకుండా కలిగితీరుతుంది. చూడండి. ఎంత గూఢమైన భావమో ఇది. తండ్రిమాట నిమిత్త మాత్రమే గాని నిజంగా తాను వచ్చింది కేవలేనాత్మ కార్యేణ అని ఆయన అన్నట్టే తనపని కోసమే. అంటే దుష్టశిక్షణ కోసమే వచ్చాడు. ఆ పని సాధించటమే తన కర్తవ్యం అంటే భగవత్ ప్రయోజన మదేననిగదాఅర్థం.

  శరభంగుడు సుతీక్షుడి దగ్గరికి వెళ్లమని చెప్పటం - సుతీక్షుడాయన కాతిథ్యంచేసి మళ్లీ ఒకసారి నా దగ్గరికి రమ్మని చెప్పటం - రెండూ భావ్యర్థ సూచనే. మరలా కొంతకాలానికి సుతీక్షుడి దర్శనం చేసుకుంటాడు రాముడు. కొన్నాళ్ళక్కడ ఉండి ఒకరోజు ఆయనను అడగుతాడు ఆగస్త్యుని ఆశ్రమ మెక్కడో చెప్పమని.

Page 23