#


Index

మనుత్తమమ్ - దైవాసురేచ సంగ్రామే - దదౌ రాజావరమ్ - ఇంతకు ముందు నీతల్లి కైకను పరిణయమాడే సమయంలో మీ మాతామహుడితో ఒక సమయం చేసుకుని ఉన్నాడు మన తండ్రి. ఆవిడకు పుట్టిన కుమారుడికే రాజ్యమప్పగిస్తానని, ఆ తరువాత తల్లికి రెండు వరాలు కూడా ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అదే ఆయనకున్న ఋణం. దాన్ని తీర్చి ఆయనను ధర్మాత్ముడు సత్యవచనుడని లోకానికి నిరూపించ వలసిన బాధ్యత నీమీదా నామీదా ఉంది. చూడండి. ఈ రహస్యవృత్తాంతం బహుశా కైకకు మంథరకూ తప్ప మరెవరికీ తెలిసి ఉండదు గదా. రాముడికెలా తెలిసింది. అంతకుముందు గడచిన కథలో ఈ ప్రస్తావనే రాదెక్కడా ఉన్నట్టుండి బయటపెట్టాడంటే రాముడు పరావరజ్ఞుడైన అవతారపురుషుడు గనుకనే గ్రహించగలిగాడు. బయట పెట్టగలిగాడు.

  సరే భరతుడు పాదుకలు తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తరువాత అక్కడి మహర్షులు కొందరు తమ్ముచూచి గుసగుసలాడటం చూస్తాడు. రాముడు. వారిలో ఒక వృద్ధును కలుసుకుని దేనికీ మీరంతా ఇలా ఆందోళన చెందుతున్నారు. మావల్ల అపచారమేమీ జరగలేదుగదా అని అడుగుతాడు. దాని కాయన ఇలా సమాధానమిస్తాడు. అయ్యా ! రావణుడి తమ్ముడు ఖరుడని ఒకడున్నాడు. వాడికి నీవిక్కడికి రావటమిష్టంలేదు. నీవు వచ్చినప్పటి నుంచీ మమ్ములనందరినీ పట్టి బాధిస్తున్నాడు. అంచేత మేమీ అరణ్యాన్ని విడిచి మరొక చోటికి వెళ్ళుదామని చూస్తున్నాము. నీకు కూడా వాడు త్వరలోనే కీడు చేయవచ్చు. నీవూ ఇక్కడినుంచి వెళ్లిపోవటం మంచి దంటాడు. ఇది చూచారా ఈ ప్రసంగం. రాముడు తమకు శత్రువు రాక్షస సంహారం కోసమే వచ్చాడని రాక్షసుల కందరికీతెలుసు. అంటే ఆయన విష్ణువని వారికి గుర్తేనన్నమాట. అందులోనూ రావణుడి తమ్ముడు ఖరుడు. రావణుడు చెబితేనే వాడికికూడా తెలిసి ఉంటుంది.

Page 22