తరువాత కైక వల్ల అభిషేకానికి భంగమేర్పడి తన్ను సుమంత్రుడు వచ్చి తండ్రి దగ్గరకు తోడ్కొని పోయేటప్పుడు అన్న మాటలు చూడండి ఇంకా ఎంత భావగర్భితమో. నిన్ను మీ తండ్రిగారు చూడాలని కోరుతున్నారు. ప్రస్తుతం వారు కైకేయీ మందిరంలో ఉన్నారని నివేదిస్తాడు సుమంత్రుడు. కైకేయీ మందిర మనగానే గ్రహించాడు రాముడు ప్రస్తుతం పిలవనంపట మిక తన ప్రస్థానానికేనని. ఏవ ముక్తస్తు సంహృష్టో నరసింహో మహాద్యుతిః అని వర్ణిస్తాడక్కడ వాల్మీకి. ఇంతకుముందు రెండుమార్లు పిలిపించినా కలగని ఆనందమిప్పుదు కలిగిందట. అది ముఖంలో కొట్టవచ్చినట్టు ఒక కళాకాంతీ తెచ్చిపెట్టిందట. దానితో నరసింహు డయ్యాడట రాముడు - చూడండి. ఇక ఎలాగూ అరణ్యాలకు వెళ్ళుతానని నిశ్చయమాయనకు. అందుకు ఇంత హర్షం, ఇంత ఉత్సాహం. రాక్షస సంహారం చేయాలంటే ఇక నరసింహావతారాన్నే తలపింప జేయాలతడు. సీతను చూచి అంటాడు గదా. అమ్మా నాన్నా ఇరువురూ నా అభిషేక విషయమేదో ఆలోచిస్తూన్నట్టున్నారు. లక్షయిత్వాహ్యభిప్రాయం . ప్రియకామా సుదక్షిణా - సంచోదయతి రాజానమ్ మదర్ధం మదిరేక్షణా - అభిప్రాయం బాగా కనిపెట్టి మంచి చేయాలనే మంచిది గనుక మాతల్లి నాకోసం మాసాయనను బహుశా తొందర పెడుతుండవచ్చు. ఇది నాకు అర్ధకామకరం. ఈ దూత వచ్చిన వాలకం చూస్తే - ధ్రువమద్యైవమాం రాజా యౌవరాజ్యే -భిషేక్ష్యతి-ఇంకేమి తప్పకుండా నన్ను మాతండ్రి రేపు యౌవరాజ్యంలో అభిషేకిస్తాడు. ఎంత ఎకసక్కె మైనమాటో చూడండి ఇది. కైక వేసిన ప్రణాళిక తనదే అయినట్టు అదితన కిష్టమే అయినట్టు ఊరక ఈ పిచ్చిరాజు వ్యామోహంలో పడి దైవికమైన విధాన మర్థం చేసుకోటం లేదన్నట్టు ఎంత అభిప్రాయ మిమిడి ఉందో ఈ మాటల్లో.
Page 19