అందుకే మందహాసం చేస్తూ ఆయనను సాగనంపుతాడు. ఈమందహాసమే కొంపదీసే మందహాసం. దీని సంగతి తరువాత మనవిచేస్తాను.
సరే. ఉద్ధవుడు బయలు దేరుతాడు. నంద గోకులానికి పోయి నందాదులను కలుసుకొంటాడు. ఆపుణ్యాత్ముని కౌగిలించుకొని నందాభీరు డానందియై మాపాలింటికి కృష్ణు డీతడనుచున్ మన్నించి పూజించాడట. చూడండి. ఇక్కడ విశేషం గమనించాలి మనం. అక్రూరుడి కంటే ఉద్దవుడి స్థాయి ఇంకా ఒక మెట్టెక్కువగా కనిపిస్తున్నది. అక్రూరు డాయన విరూడ్రూపాన్ని దర్శించ గలిగాడంత వరకే. ఈయన అలాగాదు. ఆ రూపాన్నే తన రూపంగా భావించ గలిగిన పరమ భక్తుడు. అందుకేనేమో ఆయనను చూచే సరికి కృష్ణుడే తమ దగ్గరికి నడచి వచ్చిన ట్లనిపించింది నందాదులకు. అంతే కాదు. తరువాత గోపికలు కూడా ఆయన ఎక్కడో ఒక ఏకాంత ప్రదేశంలో ధ్యాన నిమీలిత లోచనుడై కూచొని ఉంటే పార జూచి
రాజీవాక్షుడు సుందరాస్యుడు మహోరస్కుండు-సీతాంబరుం జానుస్థిత బాహు డంబురుహ మాలా లంకృతుం డుల్లస ద్రాజత్కుండలు డొక్క వీరు డిచటన్ రాజిల్లు చున్నాడు మా
రాజీవాక్షుని భంగి నని భ్రాంతి పడతారు. సగుణ భక్తిలో ఇది సారూప్య మనే భక్తి భూమిక. భగవద్రూపమే సంక్రమిస్తుంది భాగవతుడికి. అంతకన్నా స్పృహణీయ మైన దేముంది.
ఉద్దవుడి కిలాటి భగవ ద్రూపమే గాదు. భగవత్తత్త్వ విషయమైన జ్ఞానం కూడా ఉంది.
బలుడుం గృష్ణుడు మర్త్యులే - వసుమతీ భారంబు వారింప వారల రూపంబునఁ బుట్టినాడు హరి
అని చెబుతాడు గోపకులకు. అంతే కాదు. ఆ నారాయణు డఖిలాత్ముడు-అఖిల భూతములతో ఇంధన జ్యోతి లాగా మెలగుతున్న తత్త్వ మది.
Page 187