గోపన శీలమైన ఇంద్రియ వ్యాపారాలే గోపకులు. పోతే తజ్జన్యమైన అనుభూతు లేవో అవి గోపికలు. గోప గోపిక లంటే ఇంద్రియ వ్యాపారాలు - వాటి అనుభూతులే ఇంతకూ. ఇవి మామూలుగా అయితే బాహ్య ప్రపంచాభి ముఖంగానే ప్రసరిస్తుంటాయి. అందులో సుఖాన్నే చూర గొనాలని ఆసిస్తుంటాయి. దాన్ని దాచుకొని దగ్గర పెట్టుకోవాలనే తాపత్రయ పడతాయి. అదే గోపనమంటే. కాముకులైన దేవజాతులకిది నిసర్గసిద్ధం. అది ఉన్నంత వరకూ ముక్తి లేదు. భక్తి ఉంటే గదా ముక్తి. దానికే నోచుకోలేదు మొదట వారు. అంచేత ప్రపంచాభి ముఖంగా వెళ్ళే వాటిని భగవదభి ముఖంగా మళ్లించాలి మొదట. అందుకే దేవ యోనులైన స్త్రీపుంస వర్గమంతా ఇలా గోప గోపికలుగా అవతరించింది. కృష్ణవేష ప్రతిచ్ఛన్నుడైన పరమాత్మ నలా అనుక్షణమూ సేవిస్తూ వచ్చింది. పరమాత్మ నుంచి జనించిన ఈ కళలన్నీ ఎప్పటికైనా ఆ పరమాత్మను చేరవలసిందే. అందులో లయం చెంద వలసిందే. “యథా నద్యః న్యందమానా స్సముద్రేస్తం గచ్ఛంతి నామ రూపే విహాయ తథా ఇమాః కలాః పురుషాయణాః పురుషమ్ ప్రాప్య అస్తమ్ యంతి" అనే శాస్త్ర వాక్యాని కిది శేష భూతమైన అర్థవాదం. అంతకన్నా మరేమీ లేదు.
గోప గోపికా జన వృత్తాంతమైన తరువాత ముఖ్యంగా పరిగణించ వలసిన పరమ భాగవతులిద్దరే ఇద్దరున్నారు. ఒకడు అక్రూరుడు. మరొకడు ఉద్దవుడు. వీరిద్దరూ కృష్ణుని వంశంలో జన్మించిన వారే. ఆయనకు సంబంధులే. “సంబంధులై వృష్ణులున్” అని నారదుడు చెప్పినట్టు వీరిది సంబంధ భక్తి. అయితే అలా చెప్పటం కూడా అంతసరి గాదేమో. ఏమంటే సంబంధు లాయన కెందరు లేరు. ఉగ్రసేన, శూరసేన కంసాదులంతా సంబంధులే గదా. వారందరికీ ఆయన యెడల భక్తి ఉందా పెట్టిందా. కాబట్టి సంబంధమనేది అకించిత్కర మిక్కడ. అది ఉన్నా లేకున్నా భక్తి అనేది ఉన్నవాడి కున్నది. లేని వాడికి లేదు. అక్రూరోద్దవులు యదువంశంలో పుట్టట మనేది యాదృచ్ఛికం.
Page 176