భాషించక భాషించక ఎప్పుడో ఒక్కసారి భాషిస్తాడు. అది అన్నీ తెలిసిన భగవానుడు భాషించినట్టే ఉంటుంది. అక్కడక్కడ ఇదేమిట దేమిటని మాత్రమే అడిగింది రాముడు. ఇక ఎప్పుడేది ఏ కరువు పెట్టినా విశ్వామిత్రుడే. కేవలం తానొక సాక్షిమాత్రుడుగానే ఆలకిస్తూ ఆయన చెప్పింది ఆచరిస్తూ ఉండిపోతాడు. చూడబోతే ఆయన ప్రణాళికంతా తన ప్రణాళికే గనుక అలా మౌనం వహించాడని తోస్తుంది. మౌన మర్థాంగీ కారమనే మాట ఉండనే ఉందికదా. పోతే అంతవరకూ తొణకని రాముడాఖరున పెండ్లివారితో పాటు అయోధ్యకు తరలిపోయే సమయంలో విజృంభిస్తాడు. పరశురాము డెదిరించి నిలిచినప్పుడే ఆయన ఘాటుగా మాటాడింది. పరశురాము డూరక ప్రగల్భాలు పలుకుతుంటే అంతావిని రాముడు శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ - నీవు చేసిన ఘనకార్యాలన్నీ ఎరుగుదును లేవోయి మహాత్మా పశ్యమే ద్యపరాక్రమమ్ ఇక నా పరాక్రమంచూడు అని ధనుస్సు ఆరోపించటంతో పాటు అతని తేజస్సు లాగివైచి బాణం విడవబోయేసరికి ఆ మహాత్ముడు ఆదినారాయణుడని అర్ధమైపోతుందా బాపడికి. వెంటనే అక్షయం మధుహంతారం జానా మి త్వామ్ సురోత్తమమ్ - ధనుషో స్యపరామర్శాత్ - స్వస్తి తేస్తు వరంతప స్వామీ నీవు ఈ ధనుస్సును పట్టుకోటం ఎక్కు పెట్టటంలోనే అర్ధమయింది నీవు సాక్షాత్తు ఆ మధుసూదనుడవే నని నమస్కరించి వెళ్లిపోతాడు. చూడండి రాముడికీ తెలుసు పరశురాముడికీతెలుసు ఒకరి సంగతి ఒకరికి. శివధనువు విరిచాడంటే తప్పక అతడు విష్ణువేనని తెలుసు పరశురాముడికి. అందుకే వైష్ణవ ధనుస్సు తీసుకొని వచ్చాడాయన ధనుస్సు నాయనకే ఇచ్చిపోదామని. అలాగే ఆ ధనుస్సుతో ఇకమీదట తనకు చాలా అవసరముందని రాముడికితెలుసు. అందుకే ఇవ్వగానే చేతికి తీసుకున్నాడు. ఇక నీ అవతార ప్రయోజన మయిపోయింది. ఇక నాకే ఉంది రాక్షస సంహారభార మన్నట్టు. తీసుకోగానే కోపవ్యాజంతో ఆయనగారిని వెనక్కు పంపివేశాడు. మరి ఇరువురూ భగవత్స్వ రూపులు కాకుంటే ఒకరి మర్మమొక రెలా గ్రహించగలరు.
Page 17