ఇలా ఆయన చేసే చేష్టలన్నింటినీ తామూ అనుసరిస్తూ వచ్చారు. మరి ప్రతి రోజు ఆల కదుపులను తోలుకొంటూ పోయి ఆయనతో పాటు బంతి చలుదు లారగిస్తారు. "ఒకనొకని చల్దికావడి నొక డొక డడకించి దాచు”. "ఒక్కడు మున్నే మఱిచన నొక్కడు బలు బొబ్బవెట్టు నులికి పడంగన్” ఇలా తమ లో తా మెన్ని అల్లరి చేష్టలు చేసినా “వనజాక్షుడు మున్నరిగిన మునుపడ నేనేనె యతని ముట్టెద ననుచున్" పరమాత్మ వెంట పరుగిడే వారు. వారి చేష్టలు వర్ణించి చెబుతూ ఇలా అంటాడు శుక మహర్షి.
ఎన్నడునైన యోగి విభు లెవ్వరి పాద పరాగ మింతయుం గన్నులఁ గాన రట్టి హరిఁ గౌఁగిటఁ జేర్చుచుఁ జెట్ట బట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్ నగుచు తద్దయుఁ బై వడి కూడి యాడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పునే
“యచ్చావ హాసార్ధ మసత్కృ తోసి విహార శయ్యాసన భోజనేషు” అని ఇలాంటి పనులు చేసినందు కెంతో ఒడ్డుకొంటా డొకప్పు డర్జునుడు. అతడు కేవల భక్తుడూ కాదు. కేవలజ్ఞానీ కాదు. కనుకనే అలా వాపోయాడు. మరి ఈ గోపబాలురో కేవల మూఢ భక్తులు. వీరికి పరమాత్మ నిలా చేస్తున్నామే అనే భయం గాని సంకోచం గాని లేదు. విహార శయ్యాస నాదులే గాదు. ఒకరి నొకరు తన్నుతూ, గుద్దుతూ కూడా మెలగుతూ వచ్చారు. పైగా అది అపచార మనుకోలేదు వారు. ఆయన మీద చూపే ఒక గొప్ప మన్ననగా భావించారు. అది యోగుల వ్యవహారం కంటే సన్నిహిత మైనదట. అంటే కర్మ సమాధి యోగాల కన్నా భక్తి భావమే గొప్పది. అది ఎంత మూఢమైనా గాఢమే. అందుకే “మందులకు బాలుడగు హరి పొందు గని" రని మందులైనా వారి కతిసులభుండా భగవంతుడని చాటుతాడు.
మరి మూఢ భక్తి అంటే సామాన్య మని భావించ రాదు. మూఢత్వంలో కూడా అనన్య భావన అది. పరిపూర్ణ విశ్వాస మది.
Page 163