#


Index

  కాని అది ఈ బాంధవ్య మనే నివురు గప్పిన నిప్పు లాగా ఉండి పోయింది. జాజ్వల్య మానంగా ప్రకాశించ లేదు. కనుకనే నారద మహర్షి ఒక సందర్భంలో ధర్మారాజును చూచి ఇలా అంటాడు. "ప్రేమన్ మీరలు భక్తి నేము నిదె చక్రింగంటిమి” ప్రేమ చేత ఆచ్ఛాదితమైన భక్తే గాని అచ్చమైన భక్తి కాదట. మరి ఆ ప్రేమ తమకన్ని విధాలా సాయపడి నంత వరకే ఉంటుంది వ్యక్తి మీద. లేకుంటే లేదు. మరి కృష్ణుడు వారికి చేసిన ఉపకార మింతా. అంతా. “చెలియై మేన మఱంది యై సచివుడై చిత్త ప్రియుండై మహా ఫల సంధాయకుడై మెలంగుటది నీ భాగ్యంబు రాజోత్తమా” అని ఆ నారదుడే ప్రశింసిస్తాడు. జలజాత ప్రభ వాదులు కూడా చర్చించి దర్శించలేని పరమాత్మ వారికి తనకు తానే వశవర్తియై చెప్పినవీ చెప్పనివీ అన్ని పనులూ చేసి పెట్టాడు. మహాఫలాన్నే ప్రసాదించాడట వారికి. ఏమిటా మహా ఫలం. మహాఫల మంటే ఇక్కడ మోక్షం గాదు. అది పరిపూర్ణ జ్ఞానంతో రావలసిందే గాని కేవల భక్తితో - అదీ సవ్యాజమైన భక్తితో రాదు.

  కాబట్టి మహా ఫలమంటే ఇక్కడ జీవితంలో అంత కంతకు కలిగే అభ్యుదయమే. ఉపద్రవాలన్నీ దూరం చేసి ఎనలేని ఐశ్వర్యాన్ని ప్రసాదించటమే మహాఫల సంధాయకత్వం. అది ఎలాంటిదో ఇంతకుముందే అభివర్ణించాము.

పాంచాలీ కబరీ వికర్షణ మహా పాప క్షతాయుష్కులం జంచద్గర్వుల ధార్త రాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁడి ప్పించెన్ రాజ్యము పాండ వేయులకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁజే యించెన్ మూడుతురంగ మేధములు దేవేంద్ర ప్రభా వోన్నతిన్

  ద్రౌపదీ వస్త్రాపహరణ మనేది ఎంతటి అవమానకరమైన సన్నివేశం. అలాంటి ఎన్నో క్లేశాల నుంచి తప్పించిన వాడా పరమాత్మే. చివరకు ప్రాజ్యమైన సామ్రాజ్యాన్ని ధర్మజుని చేతి కందించిన వాడూ ఆయనే. మూడు అశ్వమేధ యాగాలు చేయించి దేవేంద్రుని కంటే గొప్ప కీర్తి ప్రతిష్ఠలా పాండువుల కార్జించి పెట్టిన వాడూ ఆ భగవానుడే.

Page 151