లీలా వినోదము
ఇంతెందుకు కుంతీదేవి వృత్తాంతం పరిశీలిస్తేనే మనకు తెలిసి పోయింది. ఒక ఉత్తమ వంశంలో పుట్టి జీవితంలో కష్ట సుఖాలు రెండూ చవిచూచిన ఒక భారతీయ మహిళకు ప్రతీక ఈవిడ. అన్నీ ఉండి ఏదీ లేని జీవితం. పుట్టింది యాదవ వంశంలో పెరిగింది కుంతి భోజుని ఇంట. కన్యగా ఉండే బిడ్డను కన్న దన్న దుష్కీర్తికి పాలయింది. యౌవనం లోనే భర్తను కోలుపోయింది. తరువాత కన్న కుమారులకు దూరమై వారి కపకారులైన వారి ఇంట్లోనే చాలాకాలం తలదాచు కోవలసి వచ్చింది. చివరకు తాను ప్రచ్ఛన్నంగా కన్న కుమారునికీ మిగతా కుమారులకూ పోరాటం జరుగుతూంటే వీరు ఆ వీరుణ్ణి హతమారిస్తే తీరని మనో వేదనతో కుమిలి పోయింది. ఇంత అలజడి పాలయిన జీవిత మావిడది. కనుకనే నేమో బాగా అనుభవం పండి చివరకు దాని పరిణామం అన్ని భావాలకూ స్వస్తి చెప్పి భక్తి భావ మొక్కటే నిండి పోయింది.
కృష్ణ పరమాత్మ ఆమెకు మేనల్లుడే. వసుదేవుని తోడ బుట్టిందావిడ. అంచేత చిన్నప్పటి నుంచీ ఎక్కడ ఉన్నా పరమాత్మ ఆమెకు సన్నిహితుడే. అయితే ఆయన పరమాత్మ అనే భావ మంత గాఢంగా లేకపోవచ్చు. అలాగని కేవలం మేనల్లుడే ననే సామాన్య భావమూ లేదు. ద్రౌపదీ వస్త్రాప హరణం దగ్గర నుంచీ రణ సంరంభం ముగిసే దాకా తన కుమారుల నాయన ఎంత కంటికి రెప్పలా కాపాడిందీ ఆమెకు తెలుసు. అందరితో పాటు ఆయన విశ్వరూపాన్ని సభా ముఖం గానే తిలకించిన ఎలనాగ. అలాంటి దాని కాయన భగవంతు డని తెలియక పోవటమేమిటి. చక్కగా తెలుసు. అయితే స్త్రీ స్వభావం మూలంగా కొంతా జన్మాంతర సంస్కార మంతగా లేని కారణంగా కొంతా- అంత బలంగా కుదర లేదా భక్తి భావం. కేవల మొక ఆపద్బాంధవుడైన మహాపురుషుడి లాగానే చూస్తూ వచ్చింది.
Page 145