ఎటు వచ్చి అలా కనిపిస్తున్నా వాటి నలా కనిపించే తీరులో చూడడు జ్ఞాని, మరెలా చూస్తాడు. ప్రతి ఒక్కటీ లోకంలో పెండ్లాం బిడ్డలూ - ఇల్లూ వాకిలీ - అడవులూ కొండలూ - పట్టణాలూ ప్రజలూ - వ్యాపారాలూ వ్యవహారాలూ ఏది చూచినా అది ఆ ఈశ్వర విభూతి గానే అనుసంధించు కొంటాడు. ఆ హరి పదాంబుజ గంధ రాశే ఈ నామ రూపాది కలాపమంతా. "పాదోస్య విశ్వాభూతాని” అని గదా శ్రుతి చెబుతున్నది. విశ్వమంతా దాని పాదం. అది ఒక అంబుజమే. “అప ఏవ ససర్జాదౌ” అని మొట్ట మొదట సృష్టి అయిన పదార్థ మంబువులే. పంచభూతాలకూ అది ఉపలక్షణం. పోతే ఈ భూత పంచకం నుంచి జన్మించినవే ఈ చరా చర పదార్థాలు. ఇవన్నీ ఆ పంచ భూతాల గంధం లేదా వాసనలతో కూడినవే. ఇలాంటి భూత రాశినే నిరంతరమూ సేవిస్తుంటాడు జ్ఞాని. అంటే నామ రూపాదుల తోనే వ్యవహరిస్తున్నా అదంతా భగవద్విభూతి గానే భావిస్తూ దానితోనే ముడిపెట్టి తదాకారం గానే దర్శిస్తుంటాడు.
అలాంటి ఏకాత్మ భావనతో జీవించే వాడే ఎప్పటికైనా ఆ ఈశ్వరుడి కర్మ మార్గాలేమిటో వాటిలో దాగి ఉన్న రహస్య మేమిటో తాను గ్రహించగలడు. మరొకరికి వ్యాఖ్యానించి చెప్పగలడు. ఎలాంటి కర్మ మార్గాలవి. అరవింద భవాదులు-బ్రహ్మేంద్రాదులకు కూడా తల మించి పోయినవి. వారికి కూడా దుర్లభమే. అందరానంత ఎత్తులో ఉన్నాయి. ఉదంచితం. ఎంతో మించి పోయి ఉన్నాయి. బ్రహ్మేంద్రాదులకు మించి ఉన్నాయనే విషయం కృష్ణుణ్ణి వంచించ బోయి వారే ఆయాసందర్భాలలో పరా భూతులు కావటమే మనకు నిదర్శనం. కాబట్టి హేయో పాదేయ భేదం లేకుండా సకల సృష్టిని ఈశ్వర లీలగా విభూతిగా దర్శించిన వాడికే ఆయన తన జీవితంలో చేసిన చేష్టలు బోధ పడతాయి. లేకుంటే వాటిలోని ఆంతర్యం గ్రహించలేక ఇది రంకు అది బొంకు అని శిశు పాలాదుల
Page 141