#


Index

  రాక్షసులను చంపలేడనే మాట మరిచిపో. ఆయన మహాత్ముడు, సత్యపరాక్రముడు. ఆయన సంగతి నీకేమి తెలుసు. నాకు తెలుసు. ఈ వసిష్ఠుడికి తెలుసు. ఇంకా ఇక్కడ ఉన్న మహర్షులందరికీ తెలుసు. అంటే నీకు పుత్రుడుగా కన పడుతున్న వాడీ జగత్తుకంతా పితామహుడైన బ్రహ్మదేవుడికి కూడా పితృదేవుడని ఆ తత్త్వం తపస్సంపన్నులకు తప్ప ప్రాకృత బుద్ధుల కర్థమయ్యేది కాదని భావం. వసిష్ఠుడుకూడా గట్టిగా అలా బలపరిచిన మీదట ఒప్పుకొంటాడు దశరథుడు. రాముణ్ణి పిలిపించి విశ్వామిత్రుడి కప్పగిస్తాడు. ఆ తరువాత విశ్వామిత్రో యయావగ్రే- తతో రామో మహో యశా: అని వర్ణిస్తాడు కవి. తండ్రితోగాని - ఆచార్యుడితోగాని కడకు విశ్వామిత్రుడితో గాని ఒక్క మాట మాటాడకుండా ఆయన నడుస్తుంటే ఆయనతోపాటు మౌనంగా నడస్తూపోతాడు రాముడు. చూడండి ఇది ఎంత చిత్రమో. ఎక్కడికీ ఎందుకని అడగకుండా వెళ్లే వాడెవడైనా ఉంటాడా. తెలియని మానవుడైతే అడగాలిగానీ అన్నీ తెలిసిన భగవాను డడగటం దేనికి. తెలుసు గనుకనే మౌనంగా వెళ్ళిపోయాడు.

  అంతేకాదు. మార్గమధ్యంలో బలాతి బలాదులైన అస్త్రవిద్యల నాయనకు ప్రదానంచేస్తాడు విశ్వామిత్రుడు. అవి కూడా మౌనంగానే స్వీకరిస్తాడు గాని ఒక్క మాట మాటాడడు రాముడు. చూడబోతే ఇవన్నీ ముందే తనకు తెలుసునన్నట్టు ఇలాగే జరుగబోతుందన్నట్టు తోస్తుంది మనకు. పోతే కందర్పుడి ఆశ్రమం దగ్గరకు వచ్చినప్పుడే నోరు దెరచి మాటాడా డాయన. ఇది ఎవరి ఆశ్రమం చెప్పమని అడుగుతాడు. ఫలానా అని చెబుతాడాయాన. ఆరాత్రి అక్కడే ఉంటారంతా. అక్కడ ఉన్న మహర్షులంతా వచ్చి వారిని పూజిస్తారు తెల్లవారి గంగా తరణం చేస్తుంటారు గురుశిష్యులు. అప్పుడు మరలా అడుగుతాడు రాముడు. ఈ జలమధ్యంలో ఈ తుములమైన శబ్దమేమిటని. దానికి మానస సరస్సరయూ వృత్తాంతాన్ని చెబుతాడు మహర్షి తరువాత తాటకా సంహారం - సిద్ధా శ్రమ ప్రవేశం జరుగుతాయి.

Page 14