#


Index

  దీనికి తగినట్టే ఆయన జీవించి తమ మధ్య తిరుగు తున్నంత వరకూ తెలియలేదు పాండవులకు. ఆయనా తమ బంధు కోటిలో ఒకడని భావించారు. మహా అయితే అపద్రక్షకుడైన ఒక మహానుభావుడని మాత్రమే వారాయన నర్థం చేసుకొన్నది. అంతకు మించి పరమాత్మ అనే జ్ఞానం వారికి కలగలేదు. అడపా దడపా కలిగినా అది అప్పటికప్పుడే మరలా మంచు పొరలాగే విరిసి పోతూ వచ్చింది. పోతే ఆయన జీవించి ఉండగా గ్రహించలేని రహస్యం వారాయన మరణానంతరం గ్రహించ గలిగారు. అర్జునుడు ద్వారకకు వచ్చి స్వామి వారిని వెతుక్కుంటూ పోతాడు. పోగా పోగా ఎక్కడో సాగర తీరాన దర్శనమిస్తుందాయన మృత కళేబరం. కృష్ణుని కళేబరం చూస్తానని కలలో కూడా అనుకొని ఉండ డర్జునుడు. దాని మీద పడి ఎంత గానో విలపిస్తాడు. ఎంత విలపిస్తే ఏముంది. అయిందేదో అయి పోయింది. ఇక జాగుచేస్తే సముద్రం ముంచి వేస్తుంది పట్టణాన్ని. దారుణమైన ఈ వార్త చెప్పకుండానే మభ్యపెట్టి అవరోధ జనాన్నంతా హస్తినకు తరలిస్తాడు. అడవి దారిలో దొంగలు వచ్చి మీద పడితే గాండీవ ముండి బాణాలుండి కూడా వారికి జవాబు చెప్పలేక పోతాడు. అప్పుడే గ్రహిస్తాడు మొదటి నుంచీ తన గొప్ప ఏమీ లేదంతా ఆ ఈశ్వరుడిదే నని. నెమ్మదిగా అందరినీ రాజ భవనం దగ్గరికి పట్టుకు వచ్చి అక్కడ బయట పెట్టాడు మెల్లగా స్వామి వారి చావు కబురు. దుఃఖాక్రాంతలైన కాంత లంతా చితానలంలోకి దూకి పతి ననుగమిస్తారు. ఇదంతా ఏమిటీ ఘోరమని విస్తుపోయి చూస్తూన్న ధర్మజునికి శ్రవశ్శూలాయ మానమైన వార్త చెవిన వేస్తాడు. “మన సారథి మన సచివుడు- మన వియ్యము మన సఖుండు మన బాంధవుడున్- మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియె"నని వాపోతాడు. మన మన అని మన మనుకోవలసిందే. ఆయన అనుకోలే దింతకూ. ఆయనకు మన లేదు. తన లేదు. అసలు తనువే లేదాయనకు రావటానికి. వచ్చినట్టు పోయినట్టు నటన.

Page 131