రుక్మిణికి గాని సత్యభామకు గాని ఒకరికీ తెలియ దాయన ఎక్కడికి వెళ్లాడో. ఎక్కడికో ఏమో. మార్గ మధ్యంలో బలరాము డనుజ్ఞ తీసుకొని వెళ్లి పోతాడు. యోగ మార్గంలో శరీర త్యాగంచేసి ముందుగా పోయి ఆయనకు పానువు సవరిస్తుంటాడు. దారుకుడు వచ్చి రథం తెస్తాను స్వామీ అంటే ఇంకా రథ మేమిటి వెళ్లి పొమ్మంటే ఆ రథమూ దాని పరికరాలూ ఆకాశంలోకి ఎగిరి పోయి అంతర్ధాన మవుతాయి. ఇంకా ముందుకు సాగిపోతుంటే అప్పు డెదురవుతాడు ఉద్దవుడు. ఎన్నాళ్ళ నుంచి కని పెట్టుకొని ఉన్నాడో ఏమో స్వామి ఏకాంతం కోసం. అది అయాచితంగా ఇప్పుడు లభించిం దా మహానుభావుడికి. అడగ వలసిందంతా అడిగా డాయనను. చెప్పవలసిన దంతా చెప్పాడాయన. సెలవు తీసుకొని వెళ్లి పోయాడు.
ఇక జరగ వలసిందేమిటి. ఒక్కటే. అది నిర్యాణం. ఇంతవరకూ అందరి నిర్యాణమూ జరిపాడు. ఇక తన నిర్యాణం తానే చూచు కోవలసి ఉంది. నిందలేనిది బొంది పోదని దానికొక బోయ నిమిత్తమయ్యాడు. సరిగా గురి చూచి ఆయన బొటన వ్రేలినే కొట్టాడు. దానికే వచ్చి తగిలింది బాణం. మహాపచారం మన్నించమని కాళ్లా వేళ్లా పడ్డాడు. ఏది అపచారం ఏది ఉపచారం భగవానుడికి. ఆయన ప్రణాళికలో అది లేకపోతేగా వాణ్ణి తప్పు పట్ట వలసింది. తెలియక వాడు కంగారు పడ్డాడంత మాత్రమే. స్వామి వారి కది ఎప్పుడో తెలుసు. తెలిసే అది నిమిత్తంగా శరీరం వదిలేశాడు. తెలిసి వచ్చాడు. మరలా తెలిసి పోయాడు. ప్రతి ఒక్కటీ తెలియక చేయటానికి జీవుడు కాదు గదా. దేవుడాయె. దేవుడు గనుకనే జన్మ మొదలుకొని మరణం దాకా అన్నీ తెలిసే జరిపాడు. తానే అన్నాడు గదా అర్జునుడితో “వేదాహం సమతీతాని వర్తమానానిచార్జున- భవిష్యాణిచ భూతాని మాంతు వేద నకశ్చన" అర్జునా ఆది మధ్యాంతాలు మూడూ కరతలా మలకంగా నాకు తెలుసు గాని నన్నెవరికీ తెలియదు సుమా.
Page 130