స్వామీ మీరిలాంటి మాటలనకండి-మేము వినలేము. ప్రాపంచికమైన సర్వ విషయాలూ పరిత్యజించి మీ పాదమూలాన్ని సేవించటానికి వచ్చాము. మీరు మమ్మల్నువిడిచి పెట్టకండి. అది పురుషుడు తన్నా శ్రయించిన ముముక్షువులను రక్షించినట్టు మమ్మురక్షించండి. "పతులన్ బిడ్డల బంధులన్ సతులకున్ పాటించుటే ధర్మ పద్దతి యౌ నంటివి దేహ ధారిణులకున్ ధర్మజ్ఞ చింతింపుమా పతి పుత్రాదిక నామమూర్తివగుచున్ భాసిల్లునీయందు-త త్పతి పుత్రాదిక వాంఛలం జలిపి సంభావించు ట న్యాయమే-” అని జవాబిస్తారు. అప్పుడు యోగీశ్వరేశ్వరుడైన కృష్ణు డాత్మా రాముండై వారలతో రమించాడట.
ఈ ప్రశ్నోత్తరాలను మనం బాగా పరిశీలించి చూస్తే భాగవత హృదయమేదో చక్కగా తేట పడుతుంది. అసలీ ప్రశ్నలూ లేవు. ఉత్తరాలూ లేవు. ఇది భాగవత కథలో వేసినవి కావు. కథ వినే మనలాటి పాఠకులు వేసే ప్రశ్నలివి. మన బోటి వారికి పురాణ ఋషి ఇచ్చుకొనే సమాధానాలవి. ఋషి అంటే క్రాంత దర్శి అని గదా చెప్పాము. క్రాంతదర్శి గనుకనే భూత భవిష్య ద్వర్తమానాలలో ఏకాలంలో మానవుడి కెలాంటిసంశయం రావచ్చునో ముందుగా ఉహించి తానే సమాధానమిస్తాడు. అలాగైతేనే దాని మీద మానవులకు విశ్వాస మేర్పడుతుంది. పరిపూర్ణమైన విశ్వాసం కుదిరితేనేగాని సాధన మార్గంలో పయనించలేడు మానవుడు. కనుకనే ఆయా కథా సన్నివేశాలు కల్పించి మనకు కలిగే అశంకలన్నింటినీ పరిహరిస్తూ పోతాడు మహర్షి ఇక్కడ జరిగిన పరిహారమేమిటని అడగవచ్చు. గోపికలు కృష్ణుడని మనం బాహ్యర్థం తీసుకొని బాధపడుతున్నాము. అంతర్యాన్ని పరిశీలిస్తేఅసలు గోపికలూలేరు. కృష్ణుడూలేడు. పురాణ కథలన్నీ సంకేతాలనే విషయం మనం మరచిపోరాదు. సత్యాని కల్లుకొన్న సంకేతమే కథ. సత్య మేమిటిక్కడ. గోపికా కృష్ణులంటే జీవేశ్వరులు. వారి రాస క్రీడాదులు జీవేశ్వరుల తాదాత్మ్యమే. గోపికా విరహ మనేది ఈశ్వర సాయుజ్యం కోసం జీవుడు పడే వేదన.
Page 120