మరొక కథ శమంత కోపాఖ్యానం. సూర్యోపాసన చేసి సత్రాజిత్తు సంపాదించిందా శమంతకం. అపురూప మైనదే గాక అది ఎన్నో బారువుల బంగారాన్ని ప్రసవిస్తుంది ప్రతిదినమూ. దానిని వద్దంటున్నా మెడలో ధరించి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వేటకు పోతాడు. అడవిలో వేటాడుతుంటే ఒక సింహం వచ్చి వాణ్ణి వధిస్తుంది. దాన్ని వధించి భల్లూక రాజు జాంబవంతు డామణి తీసుకొని తన నివాసానికి పోయి కూతురు జాంబవతి కిస్తాడు. ఇది ఇలా జరిగిందని తెలియక సత్రాజిత్తు కృష్ణుడే తన తమ్ముని చంపి మణి నపహరించాడని వుకారు పుట్టిస్తాడు. అది పాపుకోటానికి కృష్ణుడు స్వయంగా అడవికిపోయి జాంబవంతుని అడుగు జాడలను బట్టి అతని గుహలో ప్రవేశించి అతనితో యుద్ధం చేసి ఓడిస్తాడు. జాంబవంతు డాయన తన ఇష్టదైవమేనని గ్రహించి కన్యారత్నాన్నీ రత్నాన్నీ ఇచ్చి పంపుతాడు. అది తెచ్చి సత్రాజిత్తు కిస్తే అతడు సిగ్గుపడి క్షమాపణ చెప్పుకొని తానూ తన కన్యనూ శమంతకాన్నీ రెండింటినీ అప్పగించి స బహుమానంగా సాగనంపుతాడు. చూడండి ఎలాంటి మనోహరమైన సన్నివేశమో ఇది. ఎంతవారికైనా అపవాదు తప్పదని-మన మింత వారం కదా అని తామసించక నెమ్మదిగా దాన్ని తొలగించుకొనే యత్నం చేయాలని చేస్తే వచ్చిన అపవాదు పోవటమేగాక అనేక విధాల లోకుల మెప్పు కూడా పడయవచ్చుననీ ఎంత గొప్ప సందేశమో ఉంది. ఇలా మానవోచితంగా ప్రవర్తించటంలో కూడా తన దివ్య సందేశంతో లోకుల ఉద్ధరణకే బద్ధకంకణు డవుతాడు పరమాత్మ.
ఇంతకన్నా అతీతమైన దివ్యసందేశ మందించా డాయన గోపికలతో చేసిన విహారంలో. దీనిలో ఎంత దివ్యత్వముందో దానికి భిన్నంగా అంత దుర్విమర్శకు గురి అయింది లోకంలో. ఇది భాగవతం-భగవంతుడి చరిత్ర అని కూడా చూడకుండా ఎవరికి తోచినట్టు వారు చాలా తేలికగా మాటాడుతున్నారు. మరి నాస్తికులనూ హేతువాదులనైతే అసలు మనం పట్టనేలేము.
Page 118