అలా కాక నిర్గుణంగానే నిలిచిపోతే అది కేవలం చైతన్య స్వరూపం. అదే బ్రహ్మం. పరమాత్మ. ఇప్పుడీ రెండూ కలిపి పట్టుకొంటేనే పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం.
ఇందులో పృథివి మొదలు ఆకాశం వరకూ కనిపించే జగత్తోక విభూతి అయితే మనో బుద్ధ్యహంకారాలుగా కనిపించే జీవుడి ఉపాధి ఒక విభూతి అయితే - దీన్ని ధరించిన జీవ చైతన్యం మరొక విభూతి. అన్నీ కలిసి తొమ్మిదీ ఇవి. ఇవే శాక్తేయుల నవావరణలు. ఆత్మ చైతన్యాన్ని ఆవరిస్తాయివి. ఇదంతా తన శక్తేనను కొంటే ఈశ్వరుడు. దాని కధీనమై పోతే జీవుడు.
ఇంతకూ ఈశ్వరుడూ ఆయన ప్రకృతి రెండూ ఒకే ఒక తత్త్వం. దాని పరిణామమే ఈ చరా చర సృష్టి అంతా. కనుక రసోహమప్సు సర్వత్రా ఉన్నదా ఈశ్వరుడే. -మనలో కలిగే సాత్త్విక రాజస తామస భావాలు కూడా అదే. కాని ప్రకృతి గుణాల వలలో చిక్కి ఆమేరకే ఆగిపోయిన ఈ జీవుడికా స్వరూప మంతు పట్టడం లేదు. ఆర్తుల దగ్గరినుంచీ అందరూ సాధకులే. కాని ఎవడో ఒకడుంటాడు జ్ఞాని. వాడా ఈశ్వరుణ్ణి తన స్వరూపంగానే దర్శించగలడు. ఎన్నో జన్మలు గడిస్తే గాని ఆ జ్ఞానం కలగదు. అప్పుడే తాను తాను చూచేది అంతా పరమాత్మే అనే అనుభవ మేర్పడుతుంది.
Page 47