#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అంతకంతకూ పశ్చాత్తాపంతో పరిశుద్దుడయి - అంతకు ముందే పరి శుద్ధ అయి ఉన్న దాన్ని మరలా కలుసుకొని శాశ్వతంగా దానితో ఏకమై పోతాడు. ఇందులో అమూర్తమైన ఆ శక్తితత్త్వానికి ప్రతీకలుగా భావించి సృష్టించిన పాత్రలే మాళవికా ఊర్వశీ శకుంతలా పాత్రలు నాటకాలలో. కాగా ఆ శక్తి మూర్తీ భవించిన పాత్రలే నాయకుల పట్టమహిషులు. వారున్నా తృప్తి చెందక వీరి వెంట పడటమా కోలుపోయిన తమ సహజ శక్తిని తాము మరలా పడయటానికి చేసే మహా ప్రయత్నమే. తత్ప్రయత్న ఫలితంగా శివ శక్తులు రెండూ సమరస భావంతో కలిసి ఉండటమే నాయకాభ్యుదయ రూపమైన భరత వాక్యం నాటకానికి.

  ఇదీ కాళిదాసు భావన. ఈ భావనతోనే రచించాడు మూడు నాటకాల లోనూ మూడు కథా వస్తువులు. నాయికల ఆ వైలక్షణ్యాన్ని సూచించటానికే ఒకటి ఎప్పుడూ దృశ్యమాన అయి ఉంటే మరొకటి దృశ్యాదృశ్య రూపంగా చిత్రిస్తూ వచ్చాడు. ఆ చిత్రణ అంతా ప్రత్యభిజ్ఞా సూత్ర బద్దమే. నాటకాలు మూడూ దాని కనుబద్ధమే. మొట్టమొదట రచించాడని పేరు వడసిన మాళవికాగ్నిమిత్రమే చూడండి. ఇది ఒక చారిత్రకమైన నాటకం. చారిత్రకమైనా అంతా చరిత్ర కాదు. కొంత కవి కల్పన కూడా ఉంది. కల్పన చేయకుంటే తన సూత్రానికి రూప కల్పన చేయలేడు. ఐదంకాల నాటకమిది. నాటకంలో ఐదంకా లుండటం సహజమే. ముఖ ప్రతిముఖ గర్భ అవమర్శ నిర్వహణలని పంచ సంధులు గానే గదా విభక్త మవుతుంది కథావస్తువు. అందులో ఒక్కొక్క సంధిని నిరూపించటాని కొక్కొక్క అంకం చొప్పున ఐదంకాలుగా నాటకాన్ని విభజించటమే సముచితం. అలాగే విభజించాడీ నాటకాన్ని కాళిదాసు. ప్రతి అంకంలోనూ నాయికా నాయకులు దర్శన మిస్తారు. తతిమా వారు వస్తూ పోతూ ఉంటారు. శివ శక్తుల విలాసమే జగన్నాటకమైతే వారి ప్రతినిధులైన నాయికా నాయకుల క్రీడా రంగమే శాబ్దికమైన ఈ నాటకం. శక్తి మాళవికా రూప ధారిణి అయి కనిపిస్తుంది. నాయకుడైన అగ్ని మిత్రునికి సన్నిహిత బాంధవ్య

Page 98

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు