రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పురాతనో అంత నిత్య యౌవన కూడా. నిత్యమూ మారుతున్నప్పుడు వార్ధక్య మెక్కడిది. నిత్య యౌవనే. అందుకే శారదా గౌరీ బాలా కుమారీ అనే నామాలు కూడా ఏర్పడ్డా యావిడకు. శివ శక్తులలో ఉన్న ఈ స్వభావ వైలక్షణ్యానికి ద్యోతకంగా నేమో మహాకవి తన నాయికా నాయకుల వయసులో ఈ తారతమ్య మిలా భావించి ఉంటాడు.
మొత్తం మీద ఎలా భావిస్తే నేమి. ప్రత్యభిజ్ఞా సూత్రాన్ని మాత్రం వదలలేదు. తన కావ్యాల కంటే నాటకాలలో ఇంకా గట్టిగా పట్టుకొన్నాడు. ఆ త్రాటి మీదనే నడుపుతూ వచ్చాడు కథా వస్తువునూ పాత్రలనూ వారి ప్రతి భావాలనూ చేష్టలనూ. అంతా శిన శక్తి విలాసమే. ఏ నాటకం చూచినా ఏ కథ చూచినా అదే మనకు దర్శన మిచ్చేది. మాళవికాగ్నిమిత్రంలో మాళవిక అగ్ని మిత్రుడు. విక్రమోర్వశీయంలో విక్రముడనే పేరుగల పురూరవుడూ ఊర్వశి. మరి శాకుంతలంలో - అభిజ్ఞానంలో దాగి ఉన్న దుష్యంతుడు శకుంతల. ఈ శివ శక్తుల వృత్తాంతమే కొనా మొదలూ. పేర్లు కూడా వారి పేర్లే నాటకాలకు. అందులో ఒక చిత్ర మేమంటే ఆ రాజులకు ఒకరు కాదు చాలా మంది ఉన్నారు భార్యలు. అవరోధే మహత్యపి అని తానే వర్ణించాడు రఘువంశంలో. శాకుంతలంలో కూడా కురు ప్రియ సఖీ వృత్తిం సపత్నీ జనే అని కణ్వుడి చేతనే అని పించాడు. అలాంటప్పుడు మాళవిక అనీ ఊర్వశి అనీ శకుంతల అనీ ఈ ముగ్గురికే పట్టం కట్టట మేమిటి మహా కవి. వారందరే మయ్యారు. అందరి మాటా అలా ఉంచి అందరికీ తల మానికమైన పట్టమహిషి ఒకతి ఉంది గదా. అది సూచిస్తూనే ఉంటాడు కూడా కాళిదాసు. మూడు నాటకాలలోనూ కథా నాయకు డెంత దొంగచాటుగా ప్రేమ కలాపం సాగించినా చివరకు బయట పడితే ఆ పట్టపు రాణుల అనుమతి తోనే వీరిని పరి గ్రహంచి నట్టు వర్ణిస్తూ వచ్చాడు. ఏమి టిందులో ఉన్న ఆంతర్యం. పట్టపురాణీ-పైగా వచ్చిన రాణి. ఇద్దరే రాణులసలు ఆ నాయకుల కిష్టమైన రాణులు. అందులో పట్టపురాణి కన్నా ఇష్టమైనది పైన వచ్చిన రాణి. వీరు రాణులు కారు కవి దృష్టిలో.
Page 96