రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కాగా ఈ మార్గంలో నడచి పోయి చేరే ఆ గమ్యం కూడా ఎలా ఉంటుందో అంత వరకూ అదృష్టమై అప్పుడు దృష్టమయ్యే ఆ నిశ్రేయస మెలాటిదో వర్ణిస్తుంది విక్రమోర్వశీయంలోని నాందీ పద్యం. వేదాంతేషు.... నిశ్రేసాయాస్తు వ:- ఎంత కన్నా ఇక శ్రేయస్సు లేదో అది నిశ్రేయసం. ఎప్పుడో పోగొట్టుకొని నానా యాతనలు పడుతున్న మనం మన స్వరూపాన్ని మరలా రాబట్టుకొని బ్రహ్మానంద మనుభవించటం కన్నా శ్రేయస్సే ముంది జీవితానికి. ఇందులో పోగొట్టుకోవటం అవిద్యా తమస్సు వల్ల నైతే రాబట్టుకోవటం విద్యా తేజస్సు వల్ల. విద్య అనే ఆ తేజస్సు ఉదయిస్తే అనేకాత్మకంగా భాసించే ఈ జగత్తంతా ఏకాత్మకంగా దర్శన మిస్తుంది. అది అప్పుడు అశివం కాక శివాత్మకం మన పాలిటికి. వేదాంతాలన్నీ లోకానికి చాటి చెప్పే ఏక పురుషు డదే నంటాడు మహా కవి. ఉత్తమః పురుష స్త్వన్యః అనికాళిదాస ప్రత్యభిజ్ఞ బోధించే పురుషుడు. పూర్ణత్వాత్ పురుషః పరిపూర్ణమైన తత్త్వ మని అర్థం. భూనభోంతరా అన్నింటినీ వ్యాపించిన తత్త్వమది. ఈశ్వరుడనే పేరు దానికే చెల్లు. అనాత్మ జగత్తునంతా ఈశనం చేసేది ఆత్మ చైతన్యమే గదా. చైతన్య స్పర్శ లేక పోతే దేనికి గానీ బ్రతుకు లేదు. అస్తి త్వానికే నోచుకో లేదది. కనుకనే అంతా ఆత్మ స్వరూపమే నని ఘోషించటం. అంటే అప్పటికి శివ తత్త్వం కన్నా భిన్నమైన పదార్ధమే లేదన్న మాట. అన్న మాటేమిటి. ఉన్న మాటే. ఉన్న మాట గనుకనే అది మనకు దూరంగా ఎక్కడో ఉన్నమాట అని భావించక మన స్వరూపంగా కన్న మాట అని చూడాలి ముముక్షువు. ప్రాణాద్యుపాధుల గోల నరి కట్టి అంతర్ముఖ దృష్టితో పట్టుకోవాలి దాన్ని. అధిష్ఠానంగా ఇక్కడే ఉన్నా శరీరాద్యారోపితాల క్రింద జేరి మరుగు పడి పోయిందది. సోహ మ్మనే ఈశ్వర ప్రత్యభిజ్ఞా బలంతో తిరగ తోడితే ఈ మరుగు తొలగి పోయి అది మరలా కోటి సూర్య ప్రభా భాసురంగా సాక్షాత్కరిస్తుంది. అప్పుడనేక మనే మాట లేదు. అంతా ఏకమే. శివమూ శివమే. శివేతరమూ శివమే. ప్రత్యక్షంగా కనిపించే ఈ అనాత్మ జగత్తూ -
Page 93