రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
నాటకీయతను పోషిస్తే కావ్య గతమైన శిల్పం దెబ్బతిని నీరస మనిపిస్తుంది. కవితా గుణం పాటిస్తే నాటక శిల్పం కుంటు పడి మొదలు చెడ్డ బేర మవుతుంది. రెండూ ఒక దానితో ఒకటి పెన వేసుకొని ఏక ధారగా కొనసాగే హొయలు వారి నాటక రచనలోనే మృగ్యమైన మహాభాగ్యం. అలాటి భాగ్యశాలి కాళిదాసు ఒక్కడే. దీనికి తోడు సహృదయ సమ్మోహనమైన ఒకానొక భాష ప్రయోగిస్తాడు మహాకవి. అది మరీ అపురూపం. శబ్ద స్వీకారంలోగాని వాక్యవిన్యాసంలోగాని అతని పోకడే వేరు. ఆ పోహళింపే వేరు. ఎంత సుందరమో అంత సహజం. ఇతరుల భాష అయితే అతి ఆడంబరంగా నైనా సాగుతుంది. లేదా అతి నిరాడంబరంగా నైనా నడుస్తుంది. భవభూతిమురారి ప్రభృతులది మొదటి తరగతి అయితే భాస సౌమిల్లకాదులది రెండవ జాతి. వీటి రెండింటి సంగమ క్షేత్రం కాళిదాసు కలవడిన భాషాశైలి.
పోతే రెండవ నవీన గుణం కాళిదాసులో ఆయన లలిత కళా ప్రావీణ్యం. సందర్భోచితంగా ఆయన చేసే వర్ణనలో పాత్రలచేత ఆడించే మాటలలో బహుముఖమైన ఆ వైదుష్యం మనకు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. మిగతా వారివలె కాక ఆయన సంగీతాది లలిత కళ లన్నిటిలో ఆరితేరినవాడు. ప్రియ శిష్యా లలితే కళావిధౌ - అని అజుడిమీద నెపం పెట్టి తన ప్రియురాలికే తన విద్య నేర్పుతూ వచ్చాడేమో నని కూడా నా అనుమానం. ఎంత అభిమానమో ఆకళల మీద- అంతగా వాటిని జీర్ణించుకొన్నాడు జీవితంలో. కనుకనే రచనలో ఎక్కడ చూచినా వాటి సంస్కారం తొంగి చూస్తుంటుంది. అది సంగీతమే గాదు. శిల్పమే గాదు. చిత్రమే గాదు. నాట్యమే గాదు. అన్ని కళలనూ కుమ్మరించేశాడు నాటకాలలో. వీటినిలా కుమ్మరంచా ఉంటే సందర్భ శుద్ధి ఏ మాత్రమూ చెడనీయడు మరలా. తిరగమాత లాగా వాటి ఘాటు నాటకమంతా గుబాళిస్తూ రసజ్ఞులనీ భౌతిక జగత్తునుంచి మోసుకుపోయి ఒకానొక కళా జగత్తులో దింపుతుంది. నాటకం చదువుతూ ఉన్నంత సేపే గాక చదివి ముగించిన తరువాత గూడా ఎంతో కాలం దాని పరగణాలలోనే
Page 86