రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కాగా వీటన్నిటికీ పూర్తి విలక్షణనైన బాణిలో నడిచింది కాళిదాసు నాటక శిల్పం. మరి అతడు కూడా ఎంతగానో మెచ్చిన భాస ముని నాటకాలలో కూడా కరువైన ఆ అద్భుత శిల్పం కాళిదాసులో ఏమిటా అది ఎలాంటిదా - అని ప్రశ్న వస్తుంది. ఇది కాళిదాసు ఏదో ఆత్మ సంభావనతో చెప్పుకొన్న మాట కాదు. ఎంతో ఆత్మ విశ్వాసంతో లోకానికి చాటిన సత్యం. స్వాతి శయంతోనే చెప్పి ఉంటే అలాటి నాటకాలు రసజ్ఞ శేఖరులైన ఆనాటి సామాజికులు చూచేవారు కాదు. చూచినా మెచ్చేవారు కాదు. ఇది ఆ పరితోషా ద్విదుషాం అని వాపోయిన కవి మాటలలోనే మనకు స్పష్టంగా తార్కాణ మవుతున్నది. కానీ ఇన్నాళ్ళ నుంచీ ఇన్నేళ్ళ నుంచీ ఆయన రచనలకు ప్రచారం వచ్చిందంటే- అలాటి ప్రచారం తత్సమ కాలికమైన వాటికీ తత్పూర్వ కాలికమైన వాటికీ రాలేదంటే- నిజంగా ఆయనగారు సెల విచ్చినట్టు నవనవోన్మేష భాసురాలే అవి. సందేహం లేదు. అయితే ఏమిటా అనితర కవి సాధ్యమైన నవీనత అని అడగవచ్చు.
మొదటి దాయన ఏది గానీ నాటకంగా వ్రాయగలడు. కావ్యంగానూ వ్రాయగలడు. అంటే కావ్యం వేరుగా నాటకం వేరుగా నని కాదు అర్థం. అది ఎలాగూ చేసి చూపాడాయన. రఘువంశాదులైన కావ్యాలూ వ్రాశాడు. శాకుంతలాదులైన నాటకాలూ వ్రాశాడు. అది కాదు నేను చెప్ప దలచిందిక్కడ. నాటకాన్నే ఒక కావ్యంగా దిద్ది చూప గల డాయన. అలాగని మరలా నాటకీయతకు భంగం రానీయడు. నూటికి నూరుపాళ్ళూ నాటక మనిపిస్తూనే అద్భుతమైన కావ్య శిల్పాన్ని కూడా అందులో చొప్పించి చూపగల నేర్పరి. ఏక కాలంలో శ్రవ్య దృశ్య లక్షణాలు రెండూ మేళవించి ఇది నాటకమా కావ్యమా అని పోల్చుకోలేని ఒక అనిర్వచనీయ స్థితిని కల్పిస్తాడు భావుకుడి చిత్తానికి. నాటక మనుకొంటే అది నాటకం. కావ్య మనుకొంటే కావ్యం. అర్ధనారీశ్వరుడి లాగా ఎటుతిప్పితే అటు రెండు భూమికలలో దర్శన మిస్తుంది రచన. రెండందాలా పదునైన కత్తి లాంటిదిది. కాళిదాసు కొక్కడికే దైవదత్తమైన ఒక మహా శక్తి. మరి ఏ నాటక కర్తకూ కాన రాదు. వారు నాటకంలో
Page 85