స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సమవర్తనులయి ప్రజలను పాలిస్తుంటే ప్రజాబాహుళ్యం సకల సుఖ శాంతులూ అనుభవించే వారు. ఇది రఘువంశంలో దిలీపాదుల రాజ్య పాలన వర్ణించటం లోనే అభివ్యక్తం చేశాడు కవి. చాలా దీర్ఘంగా చేశాడా వర్ణన. అంత దీర్ఘంగా ఏ వర్ణనా చేయడు కాళిదాసు. చేశాడంటే దానిలో ఏదో ఒక అభిప్రాయ ముంటుంది. తన రోజులలో రాజుల పరిపాలనే గుర్తుకు వచ్చి ఉంటుందా యనకు రఘవంశ రాజుల పాలన వర్ణించటంలో. లేకుంటే అంత సహజంగా హృదయంగమంగా వర్ణించ లేడు. తా ననుభవించి వ్రాసినప్పుడే కవి అంత ఆవేశ పరుడై వ్రాయ గలిగేది. నిజంగా అలాగే వ్రాశాడు ఆ ఘట్టం. మచ్చు కొకటి రెండు శ్లోకాలు చూడండి తెలిసి పోతుంది. ప్రజానాం వినయాధానాత్ రక్షణాత్ భరణాదపి - సపితా పితర స్తాసాం - కేవలం జన్మ హేతవః. ప్రజలకు తగిన శిక్షణ ఇవ్వటం వల్లనూ వారిని కాపాడటం వల్లనూ - అన్న వస్త్రాలు సమకూర్చి పోషించటం వల్లనూ ఆ దిలీపుడే వారికి తండ్రి అట. మరి వారి వారి తండ్రులుంటారు గదా వారేమయినారని అడిగితే చెబుతున్నాడు. కేవలం జన్మ హేతవః అని. కేవలం వారికి భౌతికమయిన జన్మ నిచ్చిన వారేనట వారు. కాగా మిగతా భరణ రక్షణాదులన్నీ చూస్తున్న తండ్రి రాజు గారే. ఎంత గొప్ప పాలన అయి ఉండాలది. పోతే ఆ రాజులు ప్రజల నుంచి పన్నులు వసూలు చేయటంలో కూడా ఎలాటి ఔదార్య ముండేదో చెబుతున్నాడు. ప్రజానామేవ భూత్యర్థం - సతాభ్యో బలి మగ్రహీత్ - సహస్ర గుణముత్ప్రష్టు మాదత్తేహి రసం రవిః. ప్రజలనుంచి పన్నులు వసూలు చేశారంటే అది మరలా వారికోసం ఖర్చు పెట్టటానికే నట. దీనికొక చక్కని ఉపమానం చెబుతున్నాడు కవి. వేసవిలో సూర్య భగవాను డెక్కడెక్కడి జలాన్నీ కిరణాలతో పీల్చి వేస్తాడు. ఎందుకో తెలుసా. మరలా వర్షర్తువులో దానికి వేయి రెట్లు వర్షించటానికే. ఎంత చక్కని ఔపమ్యమో చూడండి ఇది. అందుకే ఉపమా కాళిదాసస్య అన్నారు. ఇంతకూ ప్రజా ప్రభుత్వాలు కాకపోయినా ప్రజలను కన్న బిడ్డల లాగా చూచేవారా రాజులు. ప్రజలంటే అసలు బిడ్డలని కూడా
Page 7