రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
రచనా ప్రత్యభిజ్ఞ
ప్రత్యభిజ్ఞా రూపమైన శివశక్తి సామరస్యమే కాళిదాసు కేర్పడిన అపూర్వమైన దృష్టి అనీ - ఆ దృష్టి కనురూపంగానే ఆయన కావ్య నాటక సృష్టి అంతా జరిగిందనీ - ప్రథమోల్లాసంలో ప్రతిపాదించాము. పోతే ఇలాటి దృష్టి సృష్టి అంతకు ముందుగానీ ఆ తరువాత గానీ ఎవరికీ లేదని కూడా చెప్పుకొన్నాము. వాల్మీక్యాదులైన ఋషులవల్ల - ఋషికల్పుడైన భాసముని వల్ల - ఎంత శిక్షణ పొందినా అది తన ప్రత్యభిజ్ఞా దీక్షను గట్టి చేసుకోటానికే గాని తనకు లేనిదేదో క్రొత్తగా పొందటానికి కాదని మనమర్థం చేసుకోవాలి. తనదృష్టి కనుగుణంగానే తన రచన. వారి దృష్టి కనుగుణంగా కాదు. తన దృష్టి కనుగుణంగా చేస్తూ వచ్చిన రచనకు వారి రచనా పరిశీలనా భ్యాస మా దృష్టిని బలంగా ఆవిష్కరించటానికి దోహదం చేసింది. అంతమాత్రమే.
అంచేత వారి మార్గం వారిది. కాళిదాసు మార్గం కాళిదాసుది. ఎవరి దృష్టి వారి దైనప్పు డెవరి మార్గం కూడా వారిదే గదా. రచనలో కాళిదాసు తన నవీనమైన దృష్టిని బట్టి ఒక నవీనమైన మార్గాన్నే అనుసరించ వలసి వచ్చింది. అందుకే నేమో తన రచనను గూర్చి ఎప్పుడెక్కడ చెప్పవలసి వచ్చినా నవం నవ మనే పేర్కొంటూ వస్తాడు కాళిదాసు. ఈ మాట ప్రతి నాటక ప్రారంభం లోనూ ఆయన నోట రావలసిందే కాళిదాస గ్రధిత వస్తునా నవేన త్రోటకేన అని పలికిస్తాడు సూత్రధారుడి నోట విక్రమోర్వశీయంలో. అభిజ్ఞాన శాకుంతల నామ ధేయేన నవేన నాటకేన అని చెప్పిస్తాడు శాకుంతలంలో. పోతే మాళవికాగ్ని మిత్రమనే నాటకంలో ఇంకా చిత్రంగా అనిపిస్తాడు. భాస సౌమిల్లకాదులైన ప్రసిద్ధ నాటక రచయిత లెందరో ఉండగా వర్తమాన కవి అయిన ఈ కాళిదాసు నాటకం ప్రయోగిస్తే ఏమి రక్తి కడుతుందని సందేహిస్తుంది నటి. దానికి సమాధాన మిస్తూ సూత్రధారు డిలా మందలిస్తా డావిడను. అయే
Page 56