స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కోట్లు గడించి కోటీశ్వరుడవుతా డొక్కొక్కడు. అప్పుడు వాడి పిత్రార్జిత మెంతో స్వార్జితమెంతో నీవు చెప్పగలవా. పిత్రార్జితం పదిపాళ్ళయితే స్వార్జితం తొంబది పాళ్ళు పెరిగి పోయి దీనిలో అది ఏ మూలనో లీనమై పోతుంది. కనిపించనే కనిపించదు కంటికి. అంతో ఇంతో పూర్వుల ఆస్తి మనకు లభించ వచ్చు. అంత మాత్రాన అదే సర్వస్వం కాదు. ముడి సరుకు లాంటిది. గనిలో నుంచి వచ్చిన రత్న మెంత విలువైన దైనా దానికి మెరుగు పెడితేనే ప్రకాశించేది. ఊరక సరకు దగ్గర ఉంచుకొని ఏమి ప్రయోజనం. సరకు ప్రకృతి జన్యమైనా ప్రయత్నం దానికి సంస్కారాన్ని ఆపాదిస్తుంది. అమాటకు వస్తే ఏకవికీ సొంత ఆస్తి అంటూ లేదు. అసలు సొంతదారు విశ్వకవి అయిన పరమాత్మ. ఆయన సొంతమీ సృష్టి అనే మహాకావ్యం. ఇక ఏ కవి కావ్యం రచించినా దీన్ని చూచి రచించ వలసిన వాడే. సామగ్రి ఇక్కడి నుంచి రావలసినదే. అలాంటప్పుడు ప్రాచేతసాదులు మహా కవులెలా అయ్యారు. ముడి సరుకును ముగ్ధ మనోహరంగా తీర్చి దిద్దటం వల్ల. దృష్ట పూర్వా అపి హ్యర్ధాః - పునర్నవా ఇవాభాంతి అని ఆనందవర్ధనుడు చాటాడంటే ఈ భావంతోనే చాటాడు లోకానికి. కాబట్టి ఒక వాల్మీకి అయినా కాళిదాసైనా మహా కవులయ్యా రంటే సామగ్రి వల్లనని కాదు. ఆ సామగ్రినెంత పరిగ్రహించాలో ఎలా మలుచుకోవాలో - ఎప్పుడెక్కడ ఎలా ప్రదర్శించాలో ఎంత తళుకు బెళుకులతో దాన్ని తీర్చి దిద్దాలో సర్వాంగ సుందరంగా దానిని భావుకుల అంతరంగాని కెలా హత్తుకొనేలా చేయాలో అలాటి ప్రతిభా సంపద వల్ల. ఇదుగో ఇలాటి ప్రతిభా సంపన్నుడు కాళిదాసు. కనుకనే ఒక వ్యాసుని అనుకరించినా ఒక వాల్మీకిని ఆశ్రయించినా ఆయన అంధ గోలాంగూల న్యాయంగా వెంట బడి పోయిన వాడు కాడు. వారి వల్ల ఎంత వరకో అంత వరకే. అది పది భాగాలయితే మిగతా తొంబది భాగాలు ఆయన సొంతం. బంగారం పాతదే. కాని రకరకాలుగా చేయించుకొన్న సొమ్ములన్నీ ఆయనవే. అవి వాల్మీకి దగ్గరా దొరకవు. వ్యాసుని దగ్గరా దొరకవు మనకు. మహా అయితే ఒక మహా మేధావి అయిన శిష్య రత్నాన్ని తయారు చేసిన సత్కీర్తి సంపాదించారా మహర్షులు.
Page 48