#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

శాకుంతలం సరే సరి. ఆది పర్వ కథా వస్తువే. పోతే రఘు వంశం. రామ చరిత మొక్కటీ రామాయణం లోనిదయితే మిగతా దిలీపుడిదగ్గరి నుంచి ఆయా రాజుల కథలు భారతంలోని కొన్ని. కుమార సంభవ కథ భారతంలో ఉంది. రామాయణంలోనూ ఉంది. మరిమేఘ సందేశం స్వకపోల కల్పితంగా కనిపించినా దానికి కూడా ఆధారం రామాయణమే నంటా రభి యుక్తులు. మల్లి నాథుడే స్పష్టంగా చెప్పాడు రామాయణంలో రాముడు సీతకు హనుమతుడి ద్వారా పంపిన సందేశాన్ని మనసులో పెట్టుకొని కవి ఈ భావ కావ్యం రచించాడని, రామగిరి చేరిన యక్షు డెవరో కాదు. ఋశ్యమూకంలో ఉన్న రాముడే. ఆకాశంలో పయనించే మేఘు డెవరో కాదు. హనుమంతుడే. మరి అలకాపురంలో దూరంగా ఏకాకిని అయి విరహ వేదన ననుభవిస్తున్న యక్ష కాంత అశోక వనంలో శింశుప క్రింద కాలక్షేపం చేస్తున్న సీతా దేవే. మల్లినాథుడి వరకూ దేనికి. అసలు కవే బయట పెట్టాడీ రహస్యాన్ని వ్యంగ్యంగా ఒకచోట. ఇత్యా ఖ్యాతే పవన తనయం మైథిలీ వో న్ముఖీ సా. ఓ మేఘమా నీవీ సందేశ వాక్యం వినిపిస్తే ఆవిడ నిన్ను జానకి హనుమంతుణ్ణి చూచినట్టుగా చూస్తుంది సుమా అని. ఇలాగా అతని కావ్యాల్లో నాటకాల్లో ఇతి వృత్త మంతా చాలా వరకూ రామాయణ భారతాల లోనిదే. కొంచెం కొరవా సరవా ఏదయినా ఉందంటే అది ఆనాడు దేశంలో ప్రచలితంగా ఉన్న కథా సరిత్సాగరాదులలోని దైనా అయి ఉంటుంది. మాళవికాగ్ని మిత్ర కథా వస్తు వందులోనిదే నంటారు విమర్శకులు. పురావృత్త కోవిదులైన పెద్దలెంతో మంది ఉండే వారాయన సమకాలికులు. అలాటి వారున్నారని కూడా ఆయన మేఘ సందేశంలో వాచా ఉదాహరించాడు. వారివల్ల కూడా కర్ణాకర్ణిగా విన్న విషయాలెన్నో ఉంటాయి కూడా. వాటినే కొన్నిటిని కథా వస్తువుగా చిత్రించి ఉంటాడు. సందేహం లేదు. కథా వస్తువు మాట దేవుడెరుగు. వ్యాస వాల్మీకుల మీద ఎంత గౌరవమంటే తాను రచించిన గ్రంథాలకే కొన్నింటికి వారి గ్రంథాలలో చూచి పేర్లు పెట్టా డాఖరుకు. కుమార సంభవం- రఘువంశమనే కావ్య సంజ్ఞలు వారు సప్లయి చేసినవే. రామాయణం బాలకాండలో వస్తాయీ పేర్లు.

Page 42

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు