స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
శ్రవ్య కావ్య శిక్షణలో ఇద్దరు. దృశ్య కావ్య శిక్షణలో ఒకరిద్దరు. మొదటి వారు వాల్మీకి వ్యాస భగవానులయితే - రెండవ వారు భాస సౌమిల్లకులు. వీరిని కంఠోక్తి గానే పేర్కొన్నా డాయన తన రచనలలో. ఇంతకన్నా ఎక్కువ మంది అసలాయనకు గురుస్థానంలో ఉండటానికి వీలు కూడా లేదు. ఎందుకంటే చారిత్రకంగా చూస్తే కాళిదాసే అసలు చాలా ప్రాచీనుడు. కావ్య కర్తలు గాని నాటక కర్తలు గాని ఆయన తరువాత వచ్చిన వారే చాలా మంది సంస్కృత సాహిత్యంలో. ఆయన సమకాలంలో నా అంత పెద్ద మేధావంతు లుండరు బహుశా. ఉంటే ఆయన లాగా ప్రసిద్ధికి వచ్చి ఉండే వారే. పోతే ఇక ఆయనకు పూర్వులయిన పెద్దలే కొద్దిమందో తక్క అంతకన్నా ఎక్కువ ఉండబోరు. వారే రామాయణ కర్త వాల్మీకి - భారత పురాణ కర్త వేద వ్యాసుడు. వీరిద్దరూ ఆరాధ్య దేవతలు కాళిదాసుకు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా శుశ్రూష చేశాడు వీరిద్దరికీ యావజ్జీవం. అలాగే నాటక శిల్పంలో మహా శిల్పి అయిన భాస మహా కవిని ఆశ్రయించాడు. సౌమిల్ల కుడెవరో ఏమి వ్రాశాడో తెలియదు గాని భాసుడు మాత్రం ప్రతిభా భాసుడే. ఎన్నో నాటకాలు వ్రాశాడు. అన్ని నాటకాలు వ్రాసిన వాడు సంస్కృతంలో మరొకడు లేడు . అన్నీ ప్రసిద్ధాలే. ప్రతి మేమిటి - ప్రతిజ్ఞా యౌగంధ రాయణ మేమిటి- వాసవదత్తేమిటి -పాంచ రాత్రమేమిటి. దేనికదే ఒక రత్నాపణం. ఈ ఆపణాలలో చేయి పెట్టి ఎంత సరకు కావాలో అంత సంగ్రహించాడు కాళిదాసు. అలాగే వాల్మీకి వ్యాసులను కూడా ఏమరించి ఎంతో సరకు హస్తగతం చేసుకొన్నాడు. కావ్యమెలా వ్రాయాలో వాల్మీకి వద్ద శిక్షణ పొందితే నాటక మెలా తీర్చి దిద్దాలో భాసుని వద్ద పొందాడాయన.
అసలు వ్యాస వాల్మీకులంటే ఎంత గౌరవమో ఆయనకు. ఎంత భక్తి ప్రపత్తులో. కావ్య వస్తువు దగ్గరి నుంచి వారి గ్రంథాల నుంచే కొని తెచ్చుకొన్నాడాయన. ఒక మాళవికాగ్ని మిత్రం తప్ప మిగతా కావ్య నాటక కథలన్నీ వారు సరఫరా చేసినవే. విక్రమోర్వ శీయ కథ వ్యాస భారతం లోనిదే.
Page 41