స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇలాంటి సమాధి యోగమెలా అభ్యసించాలో దానితో శరీర త్యాగం చేసి ఎలా సిద్ధి పొందాలో రఘు మహా రాజు జీవితంలో సోదాహరణంగా నిరూపించా డాయన. పరిచేతు ముపాంశు ధారణాం కుశపూతం ప్రవయాస్తు విష్టరం. దర్భాసనం మీద కూచొని ధారణా యోగాన్ని అలవరుచు కొంటున్నాడట. ప్రణిధానంతో మరుతః పంచ శరీర గోచరాన్. ప్రాణాపానాదు లైన అయిదు వాయువులనూ అరికట్టాడట. తరువాత గుణత్రయాన్ని జయించి సమలోష్ట కాంచనుడై సంచిత కర్మల నన్నింటినీ జ్ఞానాగ్నిలో దగ్ధం చేశాడట. చివరకీ సాధన బలంతో తమసః పరమాప దవ్యయం పురుషం అని వర్ణిస్తాడాయన నిష్క్రమణాన్ని. ఈ చివరిమాట వింటుంటే మనకు వేదాహ మేతం పురుషం మహాంతం- ఆదిత్య వర్ణం తమసః పరస్తాతనే శ్రుతి వాక్యమూ తమసః పరముచ్యతే - సతం పరం పురుష ముపైతి దివ్యమనే స్మృతి వాక్యాలూ జ్ఞప్తికి వస్తాయి. ఇవన్నీ యోగి తన అవసానంలో పరతత్త్వాన్నే చెందినట్టు వర్ణించినా అది కాలాంతరంలోనే సమకాలంలో కాదని అర్థం చేసుకోవాలి మనం. ప్రాణ శక్తి హృదయంలోనూ భ్రూమధ్యంలోనూ చేర్చుకొని తరువాత శిరః కపాలాన్ని భేదించుకొని దాన్ని సూర్య రశ్మిలో కలిపి దానితో ఆదిత్య మండలం చేరి తద్వారా హిరణ్య గర్భ లోకాన్ని ప్రవేశించి అక్కడ కేవల జ్ఞాన నిష్ఠ నవలంబించి అది ఫలించగానే ముక్తు డవుతాడు యోగి. దీనికే క్రమముక్తి అని పేరు పెట్టారు వేదాంతులు. కాళిదా సిలాంటి క్రమముక్తినే వర్ణించా డనుకోవాలి ఆ రాజుల చరిత్రలో. అయితే పరమాత్మ దర్శనమని పరమ పురుష ప్రాప్తి అని అపవర్గమని మాటలు ప్రయోగిస్తుంటాడు. వాటికి మల్లినాథాది వ్యాఖ్యాతలు జ్ఞానపరంగానే అర్థం చెబుతారు కూడా. అది ఓదనం పచతి అన్నట్టు భవిష్యత్తులో కలగబోయే మోక్ష ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా చేసిన వర్ణనే గాని మరేదీ గాదని మనం గ్రహించాలి. కనుకనే యోగ సమాధినా రఘు: సమాధి యోగం తోనే ప్రాణ త్యాగం చేశాడు రఘుమని కంఠోక్తిగానే వర్ణించాడు కాళిదాసు.
Page 25