సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పర్వతం. కాలే కాలే భవతి భవతో యస్య సాంగత్య మేత్య - స్నేహ వ్యక్తి శ్చిర విరహజం ముంచతో బాష్ప ముష్ఠం. ప్రతి వర్షర్తువులో వచ్చి తన మిత్రుణ్ణి కలుసు కొంటుందా మేఘం. అలా కలుసు కొన్నప్పుడు బహుకాలం దాన్ని ఎడబాసిన విరహాశ్రువులు వాన జల్లులనే నెపెంతో రాలుస్తుందట. అలాటి మిత్రుడికి ఆ పృచ్ఛస్వ వీడుకోలిచ్చి వెళ్ళమంటాడు దాన్ని. దారిలో ఇక దానికెన్ని హెచ్చరికలు చేస్తాడో సలహా లిస్తాడో చెప్పలేము. వాన కోయిలల దాహం తీర్చే వదాన్యుడుగా- వారకాంతల నఖక్షత వేదన తీర్చే రసజ్ఞుడుగా జాన పద స్త్రీల చూపులకొక అందగాడుగా - సారస్వతం బువులు సేవించే ఒక సంస్కార వంతుడుగా ఆదిమ దంపతుల నారాధించే ఒక సేవకుడుగా తుదకు విద్యుత్కళత్రాన్ని విడిచి ఉండని ఒక సద్గృహస్థుడుగా తన కాంతకు సాంత్వన వచనాలు చెప్పే ఒక ఆప్త మిత్రుడుగా ఎన్ని విధాల దర్శిస్తాడో వర్ణించలేము. మేఘుణ్ణి ఇలా భావించటమే గాదు. అక్కడక్కడ పర్వతాలు పట్టణాలు నదులు ఉద్యాన వనాలు ప్రకృతిలో అన్ని దృశ్యాలూ అవి చేతనమా అచేతనమా అని తేడా లేదు. సర్వం జగన్నాధ మన్నట్టు అంతా మానవుడి కాంతరంగికమే. జీవిత సర్వస్వమే. యక్షుణ్ణి నెపంగా చేసుకొని అలాగే భావించాడు వర్ణించాడు మహాకవి. ఇలాటి అద్భుతమైన సామరస్యమే ఆయన రచనా రహస్యం.
దేశానికి వ్యాపించిందీ సామరస్య దృష్టి కాలానికి వ్యాపించింది - వస్తు ప్రపంచానికీ వ్యాపించింది కాళిదాసులో. ఒక విధంగా చూస్తే మూడు కావ్యాలూ మూడింటి కుదాహరణ ప్రాయంగా చెప్పినా చెప్పవచ్చు. పర్వతంతో ప్రారంభమయి పర్వతంతో సమాప్త మయింది కుమారసంభవం. మధ్యలో కథ ఎన్ని పోకడలు పోయినా దేశైక్యాన్ని వదలలేదు కవి. పోతే రఘువంశంలో దిలీపుడు మొదలుకొని అగ్నివర్ణుడి వరకూ ఆయా రాజుల హయాము లెన్ని గడిచాయో చెప్పలేము. కాని అన్ని జీవితాలూ శైశవే భ్యస్త విద్యానా మని ఒకే ఒక ప్రణాళిక మీద సాగి పోయాయి. ఇది కాలైక్య దృష్టిని పట్టి ఇస్తున్నది.
Page 230