సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
వణకు పట్టటం మూలాన క్రమంగా మూర్చనుంచి తేరుకొంటున్నదట. ఎలా ఉందా దశ. గంగా రోధః పతన కలుషా గచ్చతీవ ప్రసాదం. గట్టు విరిగి పడి కలుషితమైన గంగా జలం మెల్ల మెల్లగా తేరుకొన్నట్టున్న దంటాడు కవి. గంగా జల మేదో గాదిక్కడ. మానవుడి బుద్ధి. అది అసుర సంపత్సంపర్కం చేత మలీ మసమైనా దాని పట్టు విడి పించుకొని అంతకంతకూ రజః స్వభావమైన ప్రయత్న బలంతో సత్త్వ శుద్ధి సంపాదించి బాగు పడాలని కవి నిగూఢమైన ఆశయం. అలాటి ఆశయ మున్నదని మన మూహించటం కాదు. కాళిదాసే ఇలాటి సూచన లక్కడక్కడా చేస్తుంటాడు మనం కొంత సవిమర్శంగా చూడగలిగితే, కృత్వా తాసా మభిగమ మపాం సౌమ్య సారస్వతానాం - అంతశ్శుద్ధస్త్వమసి భవితా వర్ణ మాత్రేణ కృష్ణః -మేఘ సందేశంలోని శ్లోకమిది. సరస్వతి అని ఒక నది. దాని జలం సారస్వతం. అది ఒకప్పుడు బలరాముడు తీర్ధయాత్రకు వెళ్ళి సేవించాడు. అదే నీవూ సేవించు. సేవిస్తే బాహ్యానికి నీవెంత నల్లనివాడవైనా ఆంతర్యంలో పరిశుద్ధుడ వవుతావని ఆశీర్వదిస్తాడు మేఘుణ్ణి యక్షుడు. ఇక్కడ ప్రస్తుతార్ధ మిదే అయినా ఆ వాడిన మాటలను బట్టి ఆలో చిస్తే వేరొక గొప్ప భావం కూడా స్ఫురిస్తున్నది. సారస్వతమైన జలం సాహిత్య రసమే. దాని నాస్వాదిస్తే చాలు వాడెలాటి వర్ణంలో పుట్టినా శారీర కంగా వాడెలాటి వాడైనా మానసికంగా పవిత్రుడే. పావన చరిత్రుడే. మానవుడి నిసర్గానికీ సంస్కారానికీ ఎలాటి ముడి వేశాడో కవి. నిసర్గతః మానవులమే కావచ్చు. సంస్కార హీనులమైతే దానవులం. ఉదాత్త సంస్కారవంతులమైతే మనమే దేవతలం. బలరాముడు సేవించాడని గదా వర్ణించాడు. అతడు కృష్ణుని అగ్రజుడు. అవతార పురుషుడు. కాబట్టి దివ్య గుణ సంపన్నుడే. అతడు సేవించిన సారస్వతా మృతం మేఘుడిలాంటి మానవుడూ సేవిస్తే సహజమైన రాజస తామస గుణాలకు స్వస్తి చెప్పి సాత్త్విక గుణాన్ని గడించగలడు. మేఘుడిలాగా ఘనుడనిపించుకొని భావాంబర వీధిలో విహరించగలడు. ఇంత దూరముంది ఇందులో సారస్యం. ఇదే కాళిదాసు ప్రవచించే జీవిత సామరస్యం.
Page 219