సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇంతెందుకు. పార్వతిని పెండ్లాడాలని కైలాసంలో పరమ శివు డెంత తహ చహ లాడాడో - మానవేంద్రుడైన దుష్యంతుడు భూతలంలో కూడా అంతగానే ఆరాట పడతాడు శకుంతలను చెట్టపట్టాలని. అది చాలా చమత్కారంగా ధ్వనింప జేశాడు కూడా కవి తన మాటల్లో. కమపర మవశం న విప్రకుర్యు - ర్విభుమపి తం యదమీ స్పృశంతి భావాః - మహాదేవుడే ఇలాటి భావ వికారాలకు లోనైతే ఇక మర్త్య లోక వాసులైన మిగతా జీవుల సంగతి చెప్పే దేముందని చూడండి చమత్కారం. ఈశ్వరుడు హిమాలమానికి దిగి వచ్చి హైమవతిని పెండ్లాడితే - దుష్యంతుడు స్వర్గానికి పయనమై పోయి అక్కడ శకుంతలను మరలా కలుసు కొంటాడు. ఒకటి మానుష మైన స్థాయికి దించి చూపాడు మరొకటి అతి మానుష మైన స్థాయి కెదిగించి చూపాడు మహాకవి. ఈ కవి లీల లింతే కాదు. ఇంకా ఉన్నాయి. వివాహా నంతరం నూతన వధూవరులు పురవీధుల్లో ఊరేగటం అది వివిధ రీతుల్లో కవులు వర్ణించి చెప్పటం పరి పాటి. కాళిదాసా సన్నివేశాన్ని ఎంత సహజంగా వర్ణించాడో అంత మనోహరంగా వర్ణించాడు. ఒక్కొక్క పుర సుందరి వారిని చూడటానికి బయటికి వచ్చి నపు డొకొక్క భంగిమను చిత్రకారుడి లాగా అద్భుతంగా చిత్రించి మనకు నేత్రోత్సవం చేస్తాడు. అది కూడా కాదు. అందులోనూ చిత్ర మేమంటే దివ్య దంపతుల ఊరేగింపు నెలా వర్ణించాడో మర్త్య దంపతులను కూడా అలాగే వర్ణించటం. కుమార సంభవంలో పార్వతీ పరమేశ్వరులను దర్శించిన పౌర కాంతల విలాసాలే రఘు వంశంలో ఇందుమతి అజ కుమారులను చూచిన కాంతల లోనూ కనపడతాయి. ఎలాటి మార్పూ లేకుండా ఆ శ్లోకాలే ఇక్కడ మనకు దర్శన మిస్తాయి. మహా అయితే ఈశాన సందర్శన లాలసలు వారైతే -వరేంద్ర సందర్శన లాలసలు వీరు. ఈశాన నరేంద్ర అనే మాటలలో తప్ప లాలసలో తేడాలే దిరువురికీ. ఆలోక మార్గం సహసా ప్రజంత్యా కయాచి దుద్వేష్టన వాంత మాల్యః. బద్ధుం న సంభావిత ఏవ తావత్ కరేణ రుద్దోపి చ కేశ పాశః - కిటికీ దాకా హడావుడిగా వస్తున్న దొకతి ఊరేగింపు చూతామని.
Page 217