సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
దేవతాత్ముడు హిమవంతుడు. సిద్ధ సాధ్యాది దేవతలందరూ అక్కడే తిరుగుతుంటారు. దేవర్షులు అక్కడే తపస్సు చేస్తుంటారు. యశ్చాప్సరో విభ్రమ మండనానాం. అప్సరస లందరికీ నేపథ్య విధాన మాయన గైరికాది ధాతువులే సవరిస్తుంటాయి. దివిజ గంగ అక్కడి నుంచే ప్రవహిస్తుంది. కైలాసం కూడా ఎక్కడో లేదు. దానికి దగ్గరే. పరమ శివు డెక్కడో గాదు అక్కడే తపస్సు చేస్తూ కూచున్నాడు. మరి జగన్మాత ఆ హిమవంతుడి కూతురే. పితృదేవతల మానస కన్యక మేనక ఆయన అర్ధాంగి. సప్త మహర్షులు కైలాసం నుంచి వచ్చి ఆయనతో పెండ్లి మాటలు మాట్లాడుతారు. పోతే గౌరీ శంకరుల కళ్యాణోత్సవ మక్కడే ఏర్పాటయింది. ఆ ఓషధీ ప్రస్థమే వివాహ వేదిక. దానికి ఈశ్వరుడు తరలి రావటమలా ఉంచి ఆయనతో పాటు వచ్చిన వారెవరెవరో తెలుసా. స్వర్గవాసులైన ముప్పది మూడు కోట్ల దేవతలూ - వైకుంఠ వాసి ఆది విష్ణువూ సత్య లోకాధి పతి బ్రహ్మా. లక్ష్మీదేవి పెండ్లి కుమారుడికి గొడుగు పడితే - సరస్వతీ దేవి శ్లోకాలు చదివి కీర్తిస్తున్నదా దంపతులను. ఇంకా చిత్రమేమంటే గంగాది నదులు స్త్రీ రూపాలలో వచ్చి వీచోపులు వీచటం. పార్వతీ పరమేశ్వరుల పెండ్లి వర్ణించినా అది దేవతల పెండ్లి కాదు. మానవ లోకంలో ఒక గొప్ప రాజ దంపతుల వివాహ వర్ణన. ఖడ్గ నిషక్త ప్రతిమం దదర్శ. ఒక క్షత్రియ కుమారుడి లాగా ఈశ్వరుడు కూడా ముస్తాబు చేసుకొని అద్దంలో కాకుండా ఖడ్గంలోనే చూచుకొన్నాడట తన సౌందర్యం. తరువాత వధూవరుల శృంగార విహారాదులు వర్ణించటం చూస్తే అది దేవతలదా మానవులదా. ఆశ్చర్య మేమంటే దేవతలను మానవుల స్థాయికి దించి అలా దించుతూనే మరలా మానవులను దేవతల స్థాయికి పెంచుతూ వర్ణించినట్టు ఒక అపుర్వమైన మధురానుభవాన్ని ఇస్తుంది ఏ వర్ణన చూచినా. కాళిదాసుకు స్వర్గ మెక్కడో లేదు. దేవత లెక్కడో లేరు. కావలసిన వన్నీ సమకూరిన ఈ భూతలమే స్వర్గం. ఇందులో ఉదాత్త భావాలతో బ్రతికే మానవులే దేవతలు.
Page 216