#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అన్వేషణ. మరలా మన దగ్గరికే వచ్చి మనలోనే పర్యవసితం కావాలి. మన జీవితానికే అది ఫలిత మివ్వాలి. అప్పుడే మన కభివృద్ధి ఆశయ సిద్ధి. ఒక నది ఎక్కడ పుడుతుంది. కొండలో కోనలో అంటావు నీవు. కాదు. అది పుట్టేది సాగరంలో. సాగర జలమే సూర్య భగవానుడు సహస్ర ముఖాలతో పీల్చి మేఘ మండలం సృష్టి అయితే అది కొండల మీద వర్షించి సలయేరులై నేల జారితే అవి గంగాది నదులై సాగుతూ పోతే అవే మరలా సాగరంలో కలుస్తున్నాయి. అప్పటికి సాగర జలమే సాగరంలో చేరిపోతున్నది. అంటే ఏమన్న మాట. ఏదైనా సృష్టిలో ఒక పదార్థం తన నుంచి దూరం పోయి మరలా ఎప్పటికో ఒకప్పటికి తనలో తాను చేరిపోవటమే పరపూర్ణత. అలాగే ప్రస్తుతం మనం మన జీవితాల దగ్గరి నుంచి ముందుకు సాగిపోతున్నాము ఆయా లోకాలన్నీ విహరిస్తున్నాము మన భావనలో. తిరిగి ఆ భావనా జగత్తు నంతా తెచ్చి మన జీవితంతోనే ముడి పెట్టుకొని చూస్తున్నాము. చూచే కొద్దీ మన ఈ మానవ జీవితమే పరిపూర్ణమయి దివ్యమైన అనుభూతిని మనకు ప్రసాదిస్తుంది. ఇదీ మానవుని విజ్ఞాన ప్రపంచ యాత్ర అంతటిలో దాగి ఉన్న గొప్ప రహస్యం. ఈ పరమ రహస్యాన్ని భేదించి పట్టుకొన్న వాడే నిజమైన ద్రష్ట, దాన్ని రచనా ముఖంగా వర్ణించి చెప్పిన వాడే స్రష్ట, ఈ విలువైన శమంతక చింతామణులు రెండూ సాధించిన పెద్ద రత్నాల వర్తకుడు కాళిదాసొక్కడే కవితా వాణిజ్య రంగంలో.

  చూడండి. ఆ మహానుభావుడి రచనలో ఎక్కడ ఏది వర్ణించినా . మానవుడే అతని మనసులో మెదిలే పాత్ర. అతని జీవితమే ఎటు చూచినా దర్శన మిచ్చేది. స్వర్గ పాతాళా లెక్కడో లేవు. మానవ లోకం కేంద్రమైతే అవి రెండూ రెండు కొస లతని దృష్టికి. ఊర్ధ్వ లోక మొక కొస. అధోలోక మొక కొస. అవి రెండూ వాటి కోసం కాదు. మానవుని కోస మున్నాయి. మానవుడి పురోగతి కోసం అతని పురుషార్థ సిద్ధి కోస మున్నాయి. స్వర్గ మెక్కడ ఉంది. కాళిదాసు నడిగితే హిమాలయం మీదనే ఉందంటాడు.

Page 215

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు