#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

తిరుగుతుంటాయి. అలాగే సుదక్షిణా దిలీపులు కూడా. వారికి రఘువనే కుమారుడు జన్మిస్తాడు. జన్మిస్తే ఆ కుఱ్ఱవాణ్ణి ఇద్దరూ ముద్దు చేస్తారు. అలా చేసినా వారి ప్రేమ ఆ బాలుడి మూలంగా విభక్తమై కూడా అవిభక్తంగానే పెరుగుతూ పోయిందట. విభక్తమైనా అవిభక్త మేమిటి. నిరాకారమైన తత్త్వం విభక్తమై నట్టు భాసిస్తుందే గాని వాస్తవంలో అది అవిభక్తమే. జగత్తూ జీవుడూ ఏర్పడ్డా ఇవి కేవల మాభాసలే కాబట్టి మూల తత్త్వాన్ని ఎప్పుడూ విభక్తం చేయలేవని ఒకానొక అద్వైత భావం కూడా స్ఫురిస్తున్నదీ పద్యంలో. మొత్తంమీద కాళిదాసు దృష్టికి స్త్రీ పురుషులనే తేడా లేదు. ఇద్దరూ కలిసి తత్త్వం. ఈ రహస్యాన్నే దేవతలు బ్రహ్మ దేవుణ్ణి స్తుతించిన సందర్భంలో సూచించాడు కవి. స్త్రీ పుంసా వాత్మ భాగౌతే. రెండూ ఒకే ఒక చైతన్య ఖండాలు. ఖండాలుగా రెండూ అఖండంగా ఒకటి. అలాంటప్పుడు భేద దృష్టి కిక చోటేముంది.

  కనుకనే తన కావ్యాలలో గాని నాటకాలలో గాని స్త్రీ పాత్ర నంత గొప్పగా చిత్రించి చూపాడు కాళిదాసు. పురుషాధిక్య మెక్కడా లేదాయన రచనలలో. పురుషు డెంతో స్త్రీ అంతే. ఒకరి కొకరు దాసులు కారు. అయితే ఇద్దరూ దాసులే కాకుంటే ఇద్దరూ ఈశులే. సంధ్యా దేవి నుపాసించి వచ్చిన శివుణ్ణి చూచి పార్వతి అలిగితే నేను సంధ్య నర్చించటం కాదు సంధ్య కూడా నన్ను భజించిందంటా డాయన. అనన్య నారీ కమనీయ మంక మని అసలా గౌరీ దేవే ఆయన ఒళ్ళో కూచుంది. శివ కామేశ్వ రాంకస్థ గదా. అక్కడ కాక ఎక్కడ కూచుంటుంది. అంతే గాదు. పత్యు శ్శిరశ్చంద్ర కళా మనేన స్పృశ అని చెలికత్తెలు వివాహానికి ముందే ఆవిడ కుపదేశిస్తారు. పతి శిరశ్చంద్రుణ్ణి పాదంతో అమ్మ స్పృశిస్తుందంటే ఎవ రెవరికి దాసులు. ఆయన దాసుడైతే ఇక దుష్యంతుడి దేముంది. పురూరవుడి దేముంది. కిం వీజయామి నళినీ దళ తాళ వృంతైః - సంవాహయామి చరణా వుత పద్మ తామ్రా. తాళవృంతాలతో వీచినా వీస్తాడు కాళ్ళు పట్టమన్నా పడతాడు. పట్టాడు

Page 195

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు