#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సెలవిచ్చా డాయన. నాట్యమనే గాదు. ఆ మాటకు వస్తే నాట్యమనే నెపంతో తన కవితా నాట్యమే ప్రస్తుతిస్తున్నాడు. అది సకల ప్రాణీ మనో రంజకమని కవి హృదయం.

  కుమార సంభవంలో పార్వతీ పరమేశ్వరుల మహా మైథున మపరిమితంగా వర్ణించాడు కవి. దానితోనే ముగించాడు కూడా. అది చదివిన పండిత మ్మన్యు లనేకు లేమిటిది ఎంత అశ్లీలం - సాక్షాత్తూ జగత్తుకు తల్లి దండ్రులైన వారి దా ఇలా వర్ణించ వలసింది. వారి రహస్య వ్యవహారాన్ని ఇలా బట్టబయలు చేయ వచ్చునా- అని తెలిసీ తెలియక ఆక్షేపించారు. ద్విషంతి మందా శ్చరితం మహాత్మనా మని దానికి మహాకవే సమాధాన మిచ్చాడు. నిజంగా మంద బుద్ధుల కంతు పట్టని రహస్య మిది. శివ శక్తుల సామరస్యమే ఆ మహా మైథునం. అది కవితా జగత్తులో శబ్దార్థాల సామరస్యం. తమర్థ మివ భారత్య - సుతయా యోక్తు మల్హసి అని సప్తర్షులు హిమవంతుడితో అన్న మాట. పార్వతిని పరమేశ్వరుడి కిచ్చి పెండ్లి చేయటం శబ్దాన్ని దాని అర్థంతో కూర్చట మట. ఈ కూర్పే ఈ కలయికే మైథునం. అది విడిపోకుండా ఎప్పటికీ అవినాభావంగా ఉండాలని ఆసించటమే మహామైథునం. అందుకే ఆ అవినాభావంతోనే ముగించాడా కావ్యాన్ని. అదే మేఘదూతంలో కూడా. మాభూదేవం కథమపి చ తే విద్యుతా విప్రయోగః అని ఆశీర్వదించాడు మేఘుణ్ణి ఆ యక్షుడు. ఇలాటి పురాణ దంపతుల ఆవినాభావ రూపమైన సామరస్యాన్నే శబ్దార్థ మయమైన కవితా వస్తువుగా దర్శించి దానినే కథా పాత్ర వర్ణనా ద్యనేక ముఖాలతో విసుగు లేకుండా వర్ణిస్తూ వచ్చాడా మహాకవి. తదపదేశంతో భావుకులను కూడా తన్మార్గంలోనే పయనించి శివాత్మ భావాన్నే భజించమని హెచ్చరిక చేస్తున్నాడు. అలాగే కదా చేశాడు చివరకు శాకుంతలంలో మమాపిచ క్షపయతు నీలలోహితః - పునర్భవం పరిగత శక్తి రాత్మ భూ: అని. పువర్భవ మంటే ఏమని అర్ధం. మరలా జన్మ లేకుండుగాక అని గదా కవి ఆశించినది. అది ఫలించాలంటే నీలలోహితుడే అను గ్రహించాలి.

Page 193

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు