సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆ సందర్భంలో కావలసిం దదే కదా. ఎవరో కాదు సాక్షా జ్జగజ్జననీ జనకులే పురాణ దంపతులే కోరుకొన్నారా వృత్తాన్ని. కాగా ఇక వియోగ దుఃఖాన్ని ఎక్కడ వర్ణించాలన్నా ఉండనే ఉంది వియోగిని అనే వృత్తం. దాని పేరే వియోగిని. దాని నడక చూస్తే వియోగాన్ని చెప్పటానికే పుట్టిందా అని తోస్తుంది. రతి విలాపమూ అందులోనే వర్ణించాడు కవి - అజ విలాపమూ అందులోనే సాగించాడు. గృహిణీ సచివ స్సఖా మిథః - ప్రియ శిష్యా లలితే కళా విధౌ - కరుణా విముఖేన మృత్యునా హరతా త్వాం వద్ద కిం న మే హృతం. నోరు తెరచి బావురు మన్నట్టే ఉంది. అజ విలాపంలోనే వసిష్ఠ ముని సందేశం వినిపిస్తుంది. అది కూడా ఈ వృత్తంలోనే నడుస్తుంది. బహుశా అజుని విరహాగ్నిలో పడి అది కూడా వియోగినీ వర్గం ధరించిందేమో. నిజంలో కూడా అంతే. ఎందుకంటే ఆ వేదాంతం ఆ రాజు మనసు మీద ఏమీ పని చేయలేదనే ఆ సర్గ ముగించాడు కవి. పోతే రెండు స్రగ్దరా వృత్తాలు కనిపిస్తాయి. ఒకటి శాకుంతలంలో మరొకటి మాళవికలో. రెండూ నాందీ శ్లోకాలే. పారమేశ్వరమైన విభూతిని వర్ణించేవే. గంభీరోదాత్తంగా సాగే ఛందస్సు స్రగ్ధర అంటే. మరి వస్తువు కూడా ఉదాత్త గంభీరమే కదా. కనుకనే దాని కను గుణమైన పరి గణన.
కాగా చివరగా చెప్పుకో వలసిందొక అద్భుతమైన సన్నివేశ ముంది. అది రఘు వంశంలో దశరథుడి వేట వర్ణన. నవమ సర్గలో వస్తుందది. దాన్ని ద్రుత విలంబిత వృత్తంతో నడుపుతాడు కవి. ద్రుత విలంబిత గతులు రెండూ ఓత ప్రోతమై చిత్రంగా సాగే ఛందస్సిది వేట అలాగే గదా సాగుతుంది. పోతే సర్గ అంతా దానితోనే సాగదు. సర్గ మధ్యంలో నానా విధ చ్ఛందస్సులు చోటు చేసు కొన్నాయి. అవన్నీ అయిన తరువాత మరలా ఒకటి రెండు ద్రుత విలంబితాలు మాత్రమే దర్శన మిస్తాయి. మిగతా ముగింపు శ్లోకాలన్నీ మరలా భిన్న వృత్తాలలోనే సాగిపోతాయి. ఏమిటీ నానా గోత్ర వ్యవహారం. ఇందులోనే కనిపిస్తుంది కాళిదాసు వృత్తాచిత్య పాలనా చాతుర్యం.
Page 188