#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఏ ఘట్టాని కేది సరి పడుతుందో అతుకుతుందో దుర్భిణీ వేసి తీసుకొంటాడు.

  ఇన్ని ఛందస్సులున్నా అందులో కథా భాగాన్ని నడపటానికి మామూలుగా ఇతిహాసాలలో లాగా అనుష్టుప్పునే తీసుకొంటా డాయన. రఘు వంశంలో చూడండి దానితోనే కథ ఆరంభమవుతుంది. అది మరీ బోరు కొడుతుం దనిపిస్తే ఉపజాతి వృత్తమో వంశస్థ వృత్తమో పట్టుకొంటాడు. ద్వితీయ సర్గలో ఒకటి తృతీయ సర్గలో ఒకటీ కనపడుతుంది. కథ కొంచెం ఊపందుకొన్నా వర్ణనాత్మకంగా సాగినా అనుష్టుప్పు వదిలేసి వీటిని పరిగ్రహిస్తాడు. కుమార సంభవంలో చూడండి హిమద్వర్ణనతో మొదలైంది కథ. అంచేత ఉపజాతి తోనే మొదలయింది సర్గ. మరి మేఘసందేశంలో చద్ది కన్నా ఊరగాయ ఎక్కువని కథ పదివంతులైతే వర్ణన తొంభై వంతులు. అంచేత మొత్తం కావ్యమంతా మందాక్రాంతతో నడచింది. మందాక్రాంత కరుణ రసానికి పనికి వస్తుంది శృంగారానికీ పనికి వస్తుంది. యక్షుడి విప్రలంభశృంగారానికి తగినట్టే ఎన్నుకొన్నాడీ ఛందస్సు కాళిదాసు. ఈ వృత్తం ప్రతి పాదమూ మూడు విరుపులతో నడుస్తుంది. మందం మందం నుదతి పవన - శ్చానుకూలో యథా త్వాం. మంద్రమధ్య తార స్వరాల కనురూపమైన రచన. పోతే మేల్కొలుపు గీతా లెక్కడైనా ఆలపించ వలసి వస్తే అందు కోసం సర్గ మధ్యలో నైనా ఛందస్సు మారుస్తాడు కవి. అది ఏదో కాదు . వసంత తిలక. సుప్రభాతానికి దీనిలాగా సూటయ్యేది వేరొకటి లేదు. బహుశా ఉషః కాలోచితమైన మలయ మారుత రాగంలో సాగాలని ఆయన ఉద్దేశం కూడా అయి ఉంటుంది. రఘ వంశంలో అజుణ్ణి మేర్కొలిపే ఘట్టమీ వృత్తంలోనే నడుస్తుంది. కాళిదాసు చుట్టిన వరవడేనేమో అప్పటినుంచీ ఇప్పటిదాకా సుప్రభాత స్తోత్రాలన్నీ ఈ వసంత తిలకలోనే రచిస్తున్నారు రచయితలంతా.

  పోతే ప్రేయసీ ప్రియుల సురత క్రీడను వర్ణించటానికి రథోద్దతా వృత్తాన్ని అందుకొంటాడు కాళిదాసు. అది ఎంతో ఉత్సాహంగా సాగే వృత్తం.

Page 187

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు