సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇది మనది కాదని వదిలేసిన తరువాత మరలా దాన్ని ఆశించటమా. కలలో జరగదు. అసక్త స్సుఖ మన్వభూత్ అని కదా వర్ణించాడు ముందుగానే కవి. భోగా లనుభవించటం కాదు గొప్ప అనుభవిస్తూ కూడా ఇది మనది కాదనే. మనస్సన్యాసం. భోగంలో త్యాగమది. తేన త్యక్తేన భుంజీథాః. ఇది దిలీప జీవితాన్నంతటినీ వెలిగించే దీపమైతే ఈ భావం- రఘు జీవితాని కంతటికీ ప్రదీప మాభావం.
ఇక అజ మహా రాజున్నాడు. గొప్ప రసార్ద్రహృదయుడు. పరుల సుఖ దుఃఖాలు తనవిగా భావించి స్పందించే స్వభావ మాయనది. ఎవరినీ కోరని ఇందుమతి ఆయన నందుకే వరించిందేమో. అదీ ఎలాగని. ఒక్కొక్క రాజునూ నడయాడే దీపశిఖ లాగా గడచి పోయిందట. ఎలా ఉందంటే ఆ దృశ్యం - రాత్రి వేళ ఒకడు దివిటీ పట్టు కెడుతుంటే అది ముందుకు పోయే కొద్దీ ముందున్న మేడ వెలిగిపోతుంది. వెనుకటి మేడ చీకటయి పోతుంది. అలాగే ఎదుట కూచున్న రాజు ముఖం ఆశతో కళ కళలాడుతుంటే అంతకు ముందు కూర్చున్నరాజు ముఖం నిరాశతో నల్లగా మారిందట. ఏమి అద్భుతమైన సహజ సుందరమైన వర్ణన. కాళిదాసు ఉపమ లన్నిటికీ రాజిది. దీని మూలంగానే దీపశిఖా కాళిదాసమని అభిజ్ఞ లోకంలో ఒక బిరుదు కూడా వచ్చిందాయనకు. కాగా ఈ వర్ణనలో ఒక గంభీరమైన భావంకూడా ఇమిడి ఉంది. దీపం ప్రసాదిస్తేనే వెలుగు. లేకుంటే వేలుగులేదు. అలాగే అజునికి కూడా ఆ ఇందుమతి ఇచ్చిన వెలుగే వెలుగు జీవితానికి. లేకుంటే అది అంధకార బంధురమే. అలాగే అయింది చివరకాయన జీవిత మామె హఠాత్తుగా కన్ను మూయటంతో. అప్పటికా మేడ కూడా దాటిపోయిందా దీపశిఖ. అందుకే ఆ రాజలా వాపోయాడు. ఏమని. కరుణా విముఖేన మృత్యునా - హరతా త్వాం వద కిం న మే హృతం. కఠినాత్ముడైన ఆ విధి నిన్ను హరించాడంటే నా జీవితంలో ఏది హరించలేదు. సర్వస్వమూ కోలుపోయానని ఆక్రందిస్తాడు. ఈ వాక్యాలు చదువుతుంటే భవభూతి ఉత్తర
Page 159