#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ఉండే ఈ వైచిత్రినే తన రచన ద్వారా ప్రదర్శించి మనకు సహజంగా కలిగే ఆరాటాన్ని తగ్గించి దీని కంతటికీ మూలమైన ఒక దివ్య శక్తి లీల నుదాసీనంగా దర్శించే స్థితప్రజ్ఞతను భంగ్యంతరంగా మనకు ప్రసాదించటమే మహాకవి సంకల్పం.

  ఇంకా ఒక విశేష మేమంటే దీనికి మెరుగు పెట్టినట్టు ఎప్పటి కప్పుడు నాటకంలో లాగా రంగమూ దృశ్యమూ మారుస్తూ పోవటం. కావ్యమే కాక నాటక రచనలో కూడా చేయి తిరిగిన వాడు గదా తాను. నాటకంలో ఒకే దృశ్యం అదే పనిగా చూపగూడదు. చూపితే సొగసు లేదు సరి గదా విసుగెత్తిస్తుంది. తెర పడుతూ లేస్తూ పోవాలి. దానితో పాటు సన్నివేశం కూడా మారుతూ పోవాలి. అసలు జీవితంలో కూడా ఇంతే గదా. ఏ భావమూ ఏ సంఘటనా ఎప్పటికీ అలాగే నిలిచి ఉండదు. క్షణ క్షణం మారవలసిందే. అలా మారితేనే అది జీవితం. సరిగా దీనికి ప్రతిబింబమే నాటకం. అలాంటిదే కావ్య జీవితం కూడా. ఇది నూటికి నూరుపాళ్ళూ గుర్తించిన వాడు కాళిదాసు. అందుకే నాటకంగానీ కావ్యంగానీ నడపటంలో రెంటినీ వచ్చీపోయి ఒకే సూత్రం మీద నడుపుతూ వచ్చాడు. ఏ సన్నివేశం వర్ణించినా ఏ వర్ణన చేసినా దాన్ని ఊరక సాగదీయడు. కథ నడుపుతూనే ఉంటాడు. వర్ణన చేస్తూనే పోతాడు. సన్నివేశాలు ఎక్కడి కక్కడ మారుతూనే పోతాయి. అందులోనూ ఆఖ్యానాత్మకంగానూ సాగుతుంది శైలి. వర్ణనాత్మకంగానూ సాగుతుంది. మధ్యే మధ్యే సంవాదాత్మకంగానూ నడుస్తుంది. అక్కడక్కడా విచారాత్మకంగానూ జరిగిపోతుంది. రఘువంశాది కావ్యాలేవి మనం పరిశీలించి చూచినా గ్రహించ వచ్చు నీ రహస్యం. దిలీపుడు నందినిని సేవించే సన్నివేశం నడుస్తుండగానే అరణ్య సీమనంతా వర్ణిస్తాడు కవి. మధ్యలో సింహానికీ అతనికీ జరిగిన సంవాద మెదురవుతుంది. అందులో ఎంతో ధార్మిక గోష్ఠీ కనబడుతుంది. అజుని వివాహం ఆ తరువాత ఆయా రాజులతో యుధ్ధం పిమ్మట వన విహారం - హఠాత్తుగా ప్రియా వియోగం - అతని విలాపం -

Page 152

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు