సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
నగరంలో నివసించే గుహ్యకుల రసిక జీవన మంతా తెగ వర్ణిస్తాడు. ఆ తరువాత తన కాంత ప్రవాస జీవితం ఎంతో హృదయ విదారకంగా వర్ణిస్తూ పోతాడు. ఇదంతా చదువుతుంటే పాఠకుడికి ఇది కథా-వర్ణనా- లేక రెండూనా- రెండూ రెండుగా కాదు. ఒకటి గానే భాసిస్తుంది.
దీనికి కొంచెం నమూనా లాంటిది వక్రమోర్వశీయంలో పురూరవుడి విరహ వేదనా ఘట్టం. అవి కొండలే గావు నదులే గావు- అరణ్యాలేకావు- పక్షి మృగాలే గావు- వృక్షాలే గావు- మేఘాలే గావు. చరా చర ప్రకృతి అంతా కాంతా మయంగానే కనిపించిందా పురూరవుడి కంటికి. ప్రకృతే ఊర్వశి- ఊర్వశే ప్రకృతి. ఇలాటి ప్రణయోన్మాదంలో పడిపోయి ఆ మానవు డేమి మాటాడు తున్నాడో అతడికే తెలియదు. ప్రేమ ముదిరితే ఉన్మాద మవుతుందని ఆలంకారికు లుపదేశించిన మంత్రాన్ని కవే పట్టుకొన్నాడో- కవి చేసిన ఉపదేశ మాలంకారికులే వల్లించారో మనకు తెలియదు గాని దాని విశ్వరూప మెలాంటిదో చూడాలంటే ముమ్మూర్తులా చూపుతుందా నాటకం. నాలుగే అంకాలీ నాటకానికి. నాటకం కాదసలు త్రోటకమని కూడా పేర్కొన్నాము. భూలోక నాయకుడికి దేవలోక నాయిక జత అయితే అది త్రోటకమే. ఆ కాంతే ఊర్వశి. అలాంటిది తోడయిందంటే అసలే రసికుడైన ఆ రాజు సంగతి ఇక చెప్పాలా. అందు లోనూ ఆవిడ అంతర్ధాన మైతే. నేలనుంచి నింగిదాకా ప్రాకుతూ పోయిం దాయన ప్రణయ వల్లరి. చేతనా చేతన విభాగానికే హద్దులు చెరిపేసింది.
ఇది సరిగా యక్షుడి విషయంలోనూ తొంగి చూస్తుంది. కామార్తాహి ప్రకృతి కృపణా శ్చే తన చేతనేషు అని కవే మనకు సంజాయిషీ ఇస్తున్నాడు. కామార్తులండీ వారంతా. అలాంటి వారికీ ప్రకృతి అంతా కామమయమే. ఏమి చేస్తామంటాడు. అంతా రామమయ మన్నట్టు అంతా వారికి రామామయమే. అంతా అది గనుకనే వస్తువూ అదే అయింది. వర్ణనా అదే అయింది. ఎక్కడ ఏ అంశం వర్ణించినా ఎబ్బెట్టుగా తోచదు. విక్రమోర్వశీయంలో
Page 144