సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
నేల మీద చూపులు నిలిపి బొమ్మలాగా నిలబడి పోయిందట. బొమ్మలాగా నిలబడి దావిడ గాదు. ఈ వర్ణన చూస్తే మన మనసులు కూడా అలాగే నిలబడి పోతాయి.
కదలిక లేని చిత్రాలను గీచినట్టే కదిలే చిత్రాలను కూడా గీచి చూపగలడు మహాకవి. దుష్యంతుని రథం వెంట తరుముకొని వస్తుంటే దిక్కుతోచక భయంతో పరుగులు వారే ఒక జింక పిల్లను వర్ణిస్తున్నాడు కవి. గ్రీవా భంగాభి రామం...... స్తోక ముర్వ్యాం ప్రయాతి. రథం వెంబడించి వస్తుంటే మెడ త్రిప్పి దాని వైపే రెప్పవాల్పక చూస్తున్నదట. బాణమెక్కడ పడుతుందో నని శరీరం వెనక భాగాన్ని ముందు భాగం లోనికి ముడుచు కొంటున్నదట. మరి దర్భపోచలు నములుతూ పరుగు తీసిన అలసట మూలంగా తెరచుకొన్న నోటినుంచి అవి రాలి పడుతుంటే దారి అంతా వాటితో నిండిపోయిందట. ఇంతెందుకు. భయంతో అది నేల మీద పాతిక అయితే ముప్పాతిక భాగం ఆకాశంలోనే ఎగిరి పోతున్న దంటాడు. మృగానికున్న చపల స్వభావం- అందులోనూ భయ భ్రాంతమయి ఉన్నప్పటి చాంచల్యమంతా కన్నులకు కట్టినట్టు చేసిన వర్ణన మిది. కాగా రఘు వంశంలో ఇలాటి కదిలే చిత్రమొకటి ఉంది. స్వయంవరంలో ఇందుమతి అనే రాజ కన్య బారులు తీరి కూర్చున్న రాజ కుమారుల నడుమ నుంచి నడచి పోతున్నది. ఆవిడ ఎవడి దగ్గరికి వస్తే తన్నే వరిస్తుందని ఆశతో అతడి ముఖం వెలిగి పోతూ-తీరా తన్ను కాదని గడచిపోతే వెల వెల పోతున్నది. అది ఎలా ఉందంటే ఆ సన్నివేశం- రాత్రి పూట ఒక దివిటీ వెలిగించి ఒకడెక్కడికో తీసుకు పోతుంటాడు. రాజ వీధిలో ఆ దివిటీ అలా కదలి పోతూ దాని కాంతి ఏ ఇంటి మీద పడితే అది బ్రహ్మాండంగా వెలిగిపోతుంది. అది దాటి పోగానే మరలా చీకట్లు క్రమ్మి మరుగు పడిపోతుంది. అలా ఉందట ఆ రాకుమారుల పరిస్థితి. సంచారిణీ దీపశిఖేవ రాత్రా అనటంలో కదిలే బొమ్మనే మనముందు నిలుపుతున్నాడు కవి.
Page 140