#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

బయటికి వస్తుంటే తన నాధుడు రామ చంద్రుడు ప్రవాసం నుంచి తిరిగి వచ్చి స్వయంగా విప్పిన ఆ పట్టణ లక్ష్మి కేశ పాశం లాగా భాసిస్తున్నదట. మరి అంతకుముందు రాముడి కళ్యాణోత్సవానికి దశరధాదులు మిథిలకు తరలి వస్తుంటే వారి సైనికుల సమ్మర్గాని కోర్చుకొన్న ఆ నగరం ఒక కాంతుని సురత సమ్మర్దాన్ని భరించే కాంతలా ఉందంటాడు. అంతే కాదు. అజ మహారాజు ఇందుమతీ స్వయంవరానికి విదర్భకు వెళ్ళినపు డాయన దిగిన విడిది గృహ మెలా ఉందని వర్ణించాడో తెలుసా మహా కవి. పట్టణ మొక కాంత అయితే అందులోని ప్రాసాదమూ ఒక కాంతలాగే స్వాగత మిచ్చిందా యువరాజుకు. తస్యాధికార పురషై: ప్రణతై: ప్రదిష్టాం- ప్రాగ్ద్వార వేది వినివేశిత పూర్ణకుంభం- రమ్యాం. రాజ పురుషులు స్వయంగా వచ్చి తన కప్పగించారా విడిది పట్టు ఎలా ఉందది. ముఖద్వారాని కిరువైపులా రెండు పూర్ణకుంభాలు. ఈ కుంభాలేవో కావు. కుచ కుంభాలే. వాటితో రమ్యమైన దట అది. రమణీయ మనే గాక రమించ దగిన దని కూడా అర్థమే. అలాంటి సౌధాన్ని ఆయనకా పురుషు లప్పగించారంటే కన్య జననీ జనకులు తమ కన్యనొక వరునికి అప్పగించటమే నని స్ఫురిస్తుంది. అంతే కాదు ఇది తరువాత ఇందుమతి ఆయననే వరించబోతుందనే భావ్యర్ధానికి కూడా మహా కవి చేస్తున్న సూచన. బాల్యా త్పరామివ దశాం మదనోధ్యువాస. బాల్యంకంటే పరమైనది యౌవనం. యౌవన దశను అధిష్ఠించినట్టు అధిష్ఠించాడట అజు డాభవనాన్ని. ఇందులోనూ తరువాత ఇందుమతీ యౌవనానుభవాని కాయనే వారసుడని చెప్పక చెప్పిన ట్టయింది. ఇలాగే ఒక చోట విక్రమోర్వశీయంలో ఊర్వశి తన చెలి చిత్రరేఖతో భూలోకానికి దిగి వస్తూ త్రివేణీ తీరంలో ఉన్న ప్రతిష్ఠాన పట్టణంలోని రాజ ప్రాసాదాన్ని వర్ణిస్తూ ఇలా అంటుంది. ఏత ద్భగవత్యా భాగీరధ్యా యమునా సంగ పావనేషు సలిలేషు పుణ్యే ష్వవలోక యత ఇవ ఆత్మానం. రాజ ప్రాసాదం తన శరీర సౌష్ఠవమెలా ఉందో తెలుసు కుందామని గంగా జలాలలో తొంగి చూస్తున్నదట.

Page 134

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు