సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆ సృష్టి కర్త బ్రహ్మదేవుడయి ఉండడు. ఎందుకంటే ఆయన వేదాభ్యాస జడుడూ - విషయ వ్యావృత్త కౌతూహలుడూ పురాణ పురుషుడూ.. పాతకాలం మనిషి, అలాంటి వాడింత మనోజ్ఞమైన రూపాన్ని సృష్టించట మేమిటి. అయితే మరి ఎవరు సృష్టించారని చంద్రుడయినా అయి ఉంటాడు. మన్మథుడయినా అయి ఉంటాడు. లేదా వసంతుడయినా అయి-ఉంటాడు సృష్టి కర్త. చంద్రుడు గనుకనే ఈ కాంతి - మన్మథుడు గనుకనే ఈ హావ భావాలు - వసంతుడు గనుకనే ఈ సౌకుమార్య మేర్పడిం దీవిడకు. ఈవిడంటే ఎవరీవిడ. ఊర్వశా. కాదు. పైకి ఊర్వశిని వర్ణిస్తున్నా కవి మనసులో ఉన్నది కావ్యోర్వశే. ఆవిడ సర్వాంగ సుందరంగా కన పడాలంటే లావణ్యమూ - సౌకుమార్యమూ విలాసమూ మూడు లక్షణాలూ అవశ్యంగా ఉండి తీరాలి. అలా ఉండాలంటే దానిని నిర్మించిన కవి ఎలాంటి వాడయి ఉండాలి. కేవల శాస్త్రజ్ఞుడూ - పురాణ కర్తా అయితే లాభం లేదు. నవ నవోన్మేషంగా భావించే కుతూహలానికి దూర మతడు. వాటితో పాటు వాటికి మెరుగు పెట్టే సకల కళా కుశలుడూ రసభావ కోవిదుడూ అయి ఉండాలి. ఇదీ కాళిదాసు ఆసించిన కావ్య రచనా సౌందర్యం. ఇలాంటి సౌందర్య మెప్పు డలవడుతుంది కావ్యానికి. ఎప్పటి కప్పుడు క్రొత్తగా భాసించి నప్పుడు. నిన్నటి సరుకు నేటికి పనికి రాదు. పాత పడి పోతుంది. అందుకే నేమో సృష్టి రాద్యేవ ధాతుః బ్రహ్మ దేవుడి మొదటి సృష్టి అయి ఉంటుందా యక్షకాంత అని వర్ణిస్తాడు. ఆద్యా సృష్టిః అని రెండు మూడు చోట్ల వస్తుందీ మాట ఆయన స్త్రీవర్ణనలో. మొదటి సృష్టి అనటంలో ఏమిటాయన ఉద్దేశం. పాత పడకుండా ప్రత్యగ్రంగా భాసిస్తుందని. ఈ ప్రత్యగ్రతా ఈ ప్రత్యంగ సౌష్ఠవమూ - ఇవే కావ్య నాయికకు గాని నాయిక లాంటి కావ్యానికి గాని ఆసించేది ఆ మహా కవి. మాళవిక లాంటి కన్యక నైతే ఆయన కావ్య కన్యా నిర్విశేష గానే భావించినట్టు తోస్తుంది. ఛందో నర్తయితు ర్యథైవ మనసి శిష్టం తథాస్యా వపుః ఆవిడ సర్వాయవ సౌందర్యం చూస్తే అది గురువు గారి మనసులో ఎలా ఉంటే బాగుండు ననిపిస్తుందో అలాగే పొందుపడి ఉందట.
Page 127