#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

భావనా బలంతో స్వరూపానుభవంలో అంతర్గతమై చరితార్థ మవుతున్నది. ఈ ఆరోహణా వరోహణ ప్రయత్నంలో పరిపూర్ణత నందుకొంటున్నది. ఇంతకూ జగత్కావ్యానికి పరమాత్మే కవి. తత్ప్రతిబింబమైన కావ్య జగత్తుకు కవే పరమాత్మ. అది మాయాశక్తి కల్పితం. ఇది ప్రతిభా శక్తి నిర్మితం. అదీ సౌందర్య మయమే. ఇదీ తన్మయమే. అది సృష్టి ద్వారా దృష్టినందుకోటానికే. ఇదీ కావ్య సృష్టి ద్వారా కవి దృష్టి నందుకోటానికే.

  ఎటువచ్చీ దానికీ దీనికీ ఒక్కడే తేడా. అది నిసర్గ రమణీయం. ఇది కృత్రిమ రమణీయం. కృత్రిమమంటే క్రొత్తగా భావించి తయారు చేయటం. క్రొత్తగా భావించ నక్కర లేదు. తయారు చేయ నక్కర లేదు. అంతా రమణీయమే ఈశ్వర సృష్టి ఏదీ హేయం కాదు ఉపాదేయం కాదని చెప్పాము. రమ్యం జుగుప్సిత ముదార మథాపి నీచమనే తేడా లేదందులో. ఎక్కడ ఏది ఎలా ఉంటే సముచితమో అలాగే ఉంది ఈ జగత్తులో. కాని కాళిదాసు లాంటి కళాకారుడికది అంతగా నచ్చలేదు. తాను కోరిన అందమంతా తాను కోరిన చోట సాక్షాత్కరించాలని ఆయన ఆశ. అయితే అది సఫలం కాదని ఆయనకు తెలుసు. అందుకే వాపోతాడు కుమార సంభవంలోనే కర్ణికార మనే ఒక పుష్పాన్ని వర్ణిస్తూ. ప్రాయేణ సామగ్ర్యవిధా గుణానాం - పరాఙ్మఖీ విశ్వ సృజః ప్రవృత్తిః. అన్ని గుణాలు ఒక్క చోట పెట్టి సృష్టించటమా విశ్వ కవికే ఇష్టం లేదట. ఒక గుణముంటే ఒక గుణం లేకుండా చేస్తాడు. చూడండి. కర్ణికార మనేది ఎన్నో రంగురంగుల పుష్పం. అన్ని రంగులున్నా అందులో వాసన అనేది ఏ కోశాన లేదు. అదీ ఉంటే ఎంత బాగుండును. మరి లేకుండా చేశాడా విధాత. విధాతకే వదిలేస్తే ఆయన ఇలాగే చేస్తుంటా డేది చేసినా. సర్వాంగ సుందరంగా ఏదీ తీర్చి దిద్దడు. అలా దిద్దటాని కాయనకు మనస్కరించదు. అందుకే అంటాడు విక్రమోర్వ శీయంలో ఈ భావాన్నే ఆవిష్కరిస్తూ ఒక చోట మహా కవి. ఊర్వశి అతిలోక సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆవిడ నింత అతిలోక సౌందర్యవతిగా సృష్టించాడంటే

Page 126

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు