రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
రత్నాల లాంటి పోలికలు రామాయణానికీ శాకుంతలానికీ. భావస్థిరాణి జననాంతర సౌహృదాని అని కవి చెప్పిన సూక్తి కథా నాయకుడి విషయంలోనే కాదు. తన విషయంలో కూడా. రామాయణ రహస్యా లెన్నెన్ని ఆ మహా కవి హృదయాంతరాళాల్లో నిరంతరాను సంధాన మవుతూ వచ్చాయో. తచ్చేతసా స్మరతి నూన మబోధ పూర్వం. తనకు తెలియ కుండానే వచ్చి చోటు చేసుకొన్నాయి తన రచనలో. అదీ ఎంతో నాటకీయంగా.
నాటకీయ మైన ఈ శిల్పాని కంతటికీ వెనకాల చేరి ప్రచోదన చేస్తూ వచ్చిందింత కన్నా అతిలోకమైన ఆయన ప్రత్యభిజ్ఞా శిల్పం. అది ఆయన జీవిత సర్వస్వం. రచన అనే ప్రతి ఉచ్ఛ్వాసం లోనూ అదే పరచుకొని ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ మోతాదులో దర్శన మిస్తుందీ శాకుంతలంలో. ఇది వట్టి శాకుంతలం కాదు. అభిజ్ఞాన పురస్కృతమైన శాకుంతలం. ఆ మాట ఎక్కడ మరచి పోతామో నని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కవి ఇదే నా కథా సర్వస్వ మని. ప్రత్యభిజ్ఞాన మంథరః అని మధ్యలో కూడా దుష్యంతుడి విషయంలో మనకు జ్ఞప్తి చేస్తాడు. ఈ దృష్టితో చూస్తే ఇంకా విశ్వరూపాన్ని ధరించి సాక్షాత్కరిస్తుందీ నాటకం మన మనో నేత్రానికి. శకుంతల జీవుడి చైతన్య శక్తికి ప్రతీక. నాయిక లందరూ అలాటి ప్రతీకలే నని పేర్కొన్నాము గదా. అందులో మాళవిక నేలమీదనే దృశ్యాదృశ్యంగా నడుస్తూ పోతే ఊర్వశి నింగి నుంచి నేలకు దిగి వస్తే - ఈ శకుంతల నేలనుంచి నింగికి కపోతం లాగా ఎగిరి పోయిన దివ్య శక్తి. అది బ్రహ్మ వేత్తల దగ్గర సహజమైన రూపంలో మెలగు తుంటుందా శక్తి. ఆదే శకుంతల కణ్వాశ్రమంలో మెలగటం. దాన్ని రాజసంతో సకాముడై అందుకోవాలని చూచాడా రాజు. అందుకోవా లనుకొన్నది తన చేతన కనన్య అని తెలియ దతనికి. తన కన్య అని భావించాడు. అలా భావించే సరికి దానిని పొందాలనే కామానికి పాలయ్యాడు. అందుకే గురుజనం దగ్గర లేకున్నా వారి అనుమతి పడయ కుండానే తొందర పడి దాని నొప్పించి తన కధీనం చేసుకొన్నాడు.
Page 115