రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఒక విధంగా చూస్తే ఆశ్రమ వాసం కోలుపోవటం వల్లనే మానవుడు శ్రమ పాలవుతాడనీ మరలా ఆ శ్రమ నివారణ కావాలంటే ఆశ్రమ వాసమే చేయాలనే జీవిత రహస్యం మనకు స్ఫురిస్తున్నది. అదేదో కాదు మరలా. ప్రవృత్తే మానవుణ్ణి సంసార బంధానికి గురి చేస్తుందని దానికి భిన్నంగా నివృత్తిని సేవిస్తేనే సాయుజ్యానికి నోచుకొంటాడని భంగ్యంతరంగా మనకు బోధించటమే. భూమే ర్దివ మివా రూఢ మని ఆయనే సెలవిచ్చినట్టు అప్పుడే మానవుడు మర్త్య జగత్తు నుంచి అమర్త్య సీమ నందుకో గలడని కూడా తాత్పర్యమే.
ఈ పూర్వాపర వృత్తాంతాలను రెండింటినీ ఎంతో నర్మ గర్భంగా ఒక్క శ్లోకంలో పొందుపరిచి మనకు సూచన చేశాడా అనిపిస్తుంది మహా కవి కాళిదాసు. ఏమిటా శ్లోకం. స్త్రీణా మశిక్షిత పటుత్వ మమానుషీషు సందృశ్యతే కిముత యాః ప్రతిబోధవత్యః- ప్రాగంతరిక్ష గమనాత్ స్వమపత్య జాతం - అన్యైర్ద్విజైః పరభృతాః ఖలు పోషయంతి. ఇది ఆ శ్లోకం. పంచమాంకంలో వస్తుందిది. శకుంతల రాజును నమ్మించటాని కేవేవో చెబుతుంటే - అవి తాపస వృద్ధ గౌతమి సమర్థిస్తుంటే రాజు అపహసిస్తూ అన్న మాటలివి. స్త్రీలకు ఏ శిక్షణమూ అక్కర లేదు. జన్మ తోనే అబ్బుతాయట తెలివి తేటలు. ఇది మానవ స్త్రీలలోనే కాదు. పశుపక్ష్యాది స్త్రైణానికి కూడా సహజమే నట. చూడండి. కోకిలకు గ్రుడ్లు పెట్టటమే గాని వాటిని పొదిగి పిల్లలను చేయటం చేతగాదు. అందుకే అది చాటుగా వాటిని తీసుకు పోయి కాకుల గూళ్ళలో పెడుతుంది. అవి తమ గ్రుడ్లే నని భ్రమించి పొదిగి పిల్లలను చేస్తాయి. పిల్లలు పెరిగి పెద్దవై కూత రాగానే పొంచి ఉండి వెంటనే కోకిల వాటిని వెంట బెట్టుకొని ఎగిరి పోతుంది. ఇదీ వ్యవహారం. ఎంత తెలివో చూడండి ఆ కోకిలకు. కోకిల లాటి పక్షికే ఉంటే మనుష్యాంగన కుండదా నేర్పు. ఇదీ దీని తాత్పర్యం.
పైకి ఇదే అర్ధమైనా లోతుకు దిగి విమర్శిస్తే ఇందులో శకుంతల పూర్వోత్తర జీవితాలు రెండూ సాక్షాత్కరిస్తాయి మనకు. కోకిలాంగన ఎవరో
Page 109