రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పొందటం జరిగి పోతుంది. చిత్రమేమంటే నారదు డందుకు సంధాత. ఇదీ టూకీగా ఈ నాటక వృత్తాంతం. ఇందులో కవి పాటించిని ప్రత్యభిజ్ఞా సూత్రం మాళవికాగ్ని మిత్రం కన్నా ఇక కొంచెం ముదురు పాకంలో పడింది.
అక్కడ నాయిక మానవి అయితే ఇక్కడ దివ్య. నేలపైనే ఉండి నింగి లాగా అక్కడ అదృశ్య అయితే నింగినుంచి నేల కప్పుడప్పుడూ దిగి కనిపించే అదృశ్య ఈవిడ. ఆవిడ పట్ట మహిషి నిర్బంధంలో ఉండి మరుగు పడితే ఈవిడ దేవేంద్రాదుల నిర్బంధంలో మరుగు పడినది. పోతే అక్కడ నాగ రక్షితమైన ముద్రిక కారణంగా రాణీగారి బంధంలో నుంచి బయట పడి ఆవిడ రాజును కలుసుకొంటే ఇక్కడ లతాంగిగా మారిన ఈ లతాంగి సంగమనీయ మనే మణి ప్రభావం మూలంగా తెరమరుగు బాసి రాజుకు దర్శన మిస్తుంది. మొత్తంమీద అక్కడా ఇక్కడా సామాన్య సూత్ర మొక్కటే. అది నాయికా నాయకుల యోగమూ వియోగమూ వియోగానంతర యోగమూ. వియోగం వారి తొందర పాటు వల్ల ఏర్పడిన దైవ దుర్యోగం వల్ల నైతే వియోగానంతర యోగం వారి తహ తహ పాటుకు తోడ్పడిన దైవ సద్యోగం వల్ల. అందుకు అక్కడా ఒక అభిజ్ఞానమే సాధనం. ఇక్కడా అలాంటి ఒక అభిజ్ఞానమే.
పోతే ఈ అభిజ్ఞానం నూటికి నూరు పాళ్ళూ పని చేసింది ఆయన జీవిత చరమాంకంలో రచించిన శాకుంతల నాటకంలో. వట్టి శాకుంతలం కాదది. అభిజ్ఞాన శాకుంతలం. ప్రత్యభిజ్ఞా సిద్దాంతాన్ని పదహారు కళలతో ప్రతిబింబించే నాటకమని భావం. కనుకనే ఈ ఒక్క నాటకాన్ని ఆమూల చూడమూ పరిశీలిస్తే మిగతా ఆ మహా కవి రచన లన్నింటినీ పరిశీలించిన తృప్తి నిస్తుంది సహృదయుడికి. ఆయనకే ఇచ్చిందా తృప్తి. అలాంటి తృప్తి చెందిన వాడు గనుకనే మమాపి క్షపయతు నీలలోహితః - పునర్భవం పరిగత శక్తి రాత్మభూః. ఇక నాకా నీల లోహితుడు పునరావృత్తి అంటూ లేకుండా అనుగ్రహించు గాక అని మనసారా కోరుకొంటాడు. ఏ రచనలోనూ కోరని
Page 102