రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చివరకు పంచమాంకంలో బాహాటంగానే సంగమించి తనకు స్వాధీనం చేసుకోవటం. భావన చేస్తే జీవుడీ వ్యక్తమైన ప్రపంచంలో మరుగుపడిన తన శక్తి ఎక్కడ ఉందో తెలియక దానిని మొదట ఛాయా మాత్రంగా చూస్తాడు. అది ఆలంబనంగా స్వరూప దర్శనం కోసం తహ తహ లాడుతాడు. అందుకు శాస్త్రాచార్యాదులు తోడుపడగా వాస్తవంగానే దాన్ని దర్శిస్తాడు. అయినా ఈ వ్యక్తమైన ప్రపంచ వాసన లడ్డుపడి దూరం చేస్తే మరలా దాన్ని వశం చేసుకోవాలని పరితపిస్తూ చివర కాయా సన్నివేశాలు దైవికంగా తోడు పడితే- అది ఏదోగాదు తనదే తానేనని ప్రత్యభిజ్ఞ పొందుతాడు. అనభిజ్ఞ వల్లనే దూరమై అభిజ్ఞ వల్ల మరలా దగ్గర కావటమే గాని అసలది ఎప్పుడూ తన దగ్గరే ఉంది. అంతే గదా. మాళవిక తన దగ్గరే తన అంతఃపురంలోనే ఉన్నా తనకెంతో దూరంగా ఉన్నట్టే భావించాడు రాజు. తన బంధువైనా పరాయి దనుకొన్నాడు. చివరకు వారి వీరి వల్ల ప్రత్యభిజ్ఞ కలిగి తాను దూరమను కొన్న ఆ దేవి తనదేనని భావించి తృప్తి చెందాడు. ఎంత ప్రచ్ఛన్నమైనా ఆ శక్తి తాలూకు కళలు బయట పెడుతూనే ఉంటాయి దాన్ని. అలాగే మాళవిక ఎంత చాటు మాటున మెలగుతున్నా ఆవిడ సంగీత నాట్యాది కళలే ఆవిడ నారాజుకు బయటపెడుతూ ఆయన దృష్టి నాకర్షిస్తూ వచ్చాయి. ఇదంతా ఇలా చూస్తూపోతే మాళవికాగ్ని మిత్రుల వ్యవహారంగా కనిపించదు. ఆ వ్యాజంతో సాగిన శివ శక్తుల పరస్పరాకర్ష వికర్ష పునస్సమాకర్షణాత్మక మైన వ్యవహారమే.
పోతే ఇక రెండవ దాయన రచించిన విక్రమోర్వశీయ నాటకం. నాటకం కాదిది. సాంకేతికంగా పేర్కొంటే త్రోటకం. దివ్య మానుష సంశ్రయ మయిన ఇతివృత్తమూ- ప్రతి అంకంలో విదూషక ప్రవేశమూ - ఈ రెండు లక్షణాలూ నాటకం కంటే దీన్ని వేరు చేసి చూపుతాయి. విక్రముడు కథా నాయకుడు. విక్రముడంటే పురూరవుడే. యయాతి కుమారుడు. సకల గుణ సంపన్నుడు. విశేషించి పరాక్రమవంతుడు. అందుకే విక్రముడని బిరుద మేర్పడింది. దాని కనుగుణమైన సన్నివేశమే జరిగింది మొట్టమొదటనే. దేవేంద్రుని
Page 100