నాగరికత అనేది ఏమాత్రమూ అంటకుండా పోయింది. అరబ్బులు అలాంటి అనాగరిక జాతులలో అగ్రగణ్యులు కావటానికిదే కారణం.
ఇంతకూ హిందు అనే మాట ఇలాటి పుణ్యనదీ జలోపయోగ పరిపుష్టమైన మన భారతీయ నాగరికతా స్వరూపాన్ని లోకానికి వేనోళ్ళ చాటుతున్నది. అందులోనూ అత్యున్నతమైన హిమాలయాలలో జన్మించి అతి గంభీరమైన సాగరం దాకా ప్రవహించే ఈ నదీమతల్లులనుంచి ఔన్నత్యమూ గాంభీర్యమూ, ఈ రెండు గుణాలనూ పుణికి పుచ్చుకొన్నదా అనిపిస్తుంది మన హైందవ మతం. ప్రపంచంలో మరి ఏమతానికీ లేని విశిష్టత ఉంది మన మతానికి. మతమనేది ఎప్పుడూ సాధనమే గాని గమ్యం కాదు. గమ్యం జీవితానికొక్కటే. అది సత్యం. ఈ సత్యాన్వేషణకు మతం తోడ్పడుతుంది. మతానికే ధర్మమని ప్రాచీనుల వ్యవహారం. సత్యము, ధర్మము ఇవి రెండూ మన జీవితానికి సామగ్రి. సత్యాన్ని చెప్పే విద్య Philosophy అయితే ధర్మాన్ని బోధించేది Religion మిగతా విద్యలూ కళలూ అన్నీ ఈ రెండింటిమీదనే ఆధారపడ్డాయి. కనుకనే మొదటి నుంచీ ఏదేశంలో ఏజాతి సాహిత్యం చూచినా ఈ రెండింటి ఛాయలే గోచరిస్తుంటాయి. 'తత్తేపూషన్నపాపృణు - సత్యధర్మాయదృష్టమే' అని మన ప్రాచీనులు వాపోయారంటే అందులో ఇమిడి ఉన్న మహార్థమిదే.
ఇందులో సత్యమనేది త్రికాలాబాధ్యమని, అన్ని మతాలవారూ గుర్తించారు. కాని జీవ జగత్తులనేవి వాస్తవంలో దానికి భిన్నంగాలేవు. ఇవి కూడా దాని రూపాంతరాలే ఇవీ అదీ కలసి అంతా ఒకే ఒక అఖండమైన తత్త్వం. అలాంటి సర్వాత్మ భావాన్ని అనుభవానికి తెచ్చుకోవటమే ఎప్పటికైనా మానవుడికి కర్తవ్యమని చాటింది ఒక్క హిందూమతమే. మిగతా మతాలన్ని ఏదో ఒక అంశంలో ఇటు జగత్తుకూ అటు జీవేశ్వరులకూ భేదాన్ని చెబుతాయే గాని అబేధాన్ని చాటటానికి సాహసించలేకపోయాయి. 'అయ మాత్మా బ్రహ్మ, సర్వమ్ ఖల్విదం బ్రహ్మ' అని జీవ జగత్తులను రెండింటినీ ఈశ్వరాత్మకంగా భావించి 'ఏకమేవాద్వితీయమ్ బ్రహ్మ' అని ఆ ఈశ్వరుణ్ణి ఏకైకమైన తత్త్వంగా ప్రతిపాదించే ధైర్యం నిజంగా ఇంతమంది మానవులలోనూ హైందవులొక్కరిదే.
Page 99