హిందూ అంటే దాని వెనకాల ఎంతో ఉన్నది చరిత్ర. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడ దాన్ని చూడకుండానే వ్యవహరిస్తున్నారు. అది చాలా శోచనీయం. సింధు అనే శబ్దం పారశీకుల ఉచ్చారణలోబడి హిందు అయింది. హకారాన్ని సకారంగానూ సకారాన్ని హకారంగానూ ఉచ్ఛరించటం పారశీకుల కలవాటు. హిమాలయాల నిప్పటికీ సిమాలయాలనే పేర్కొంటారు వారు. అలాగే అసుర అనే సంస్కృత పదాన్ని అహుర అని సహస్ర అనే పదాన్ని హజార్ అని వ్యవహరిస్తారు. అలాగే సింధు అనే మాటను హిందు అని వ్యవహరిస్తూ వచ్చారు. కాబట్టి హిందు అనేది సింధు అనే సంస్కృత శబ్దానికి పారశీకరూపం.
పారశీకులకూ మన వారికీ చారిత్రకంగా బహుకాలం నుంచీ అవినాభావ రూపమైన సంబంధమున్నది. అసలు ఇద్దరూ ఒకేజాతి. పారశీకులకు ఇరేనియనులని నామాంతరం. ఇరేనియనులంటే ఆర్యనులే. మొదట అంతా ఆర్యులే. మధ్య ఆసియా నుంచి పశువులకూ తమకూ ఆహారార్థమై దేశాంతరాలకు బయలుదేరారు. యూఫ్రెటిస్ టైగ్రస్ నదుల దగ్గరికి వచ్చేసరికి ఆ నదీ సౌభాగ్యానికి మురిసిపోయి కొందరక్కడ నిలిచిపోయారు. వారే ఇరేనియనులు లేదా పారశీకులు, మిగతావారు ఇంకా నదీప్రాంత మెక్కడైనా దొరుకుతుందేమో నని అన్వేషిస్తూ కైబరు కనుమలు దాటి పంజాబు బీహారు ప్రాంతంలో ప్రవేశించారు. అక్కడి గంగా సింధు నదులూ వాటి మధ్య ఉన్న సారవంతమైన పరగణా చూచే సరికి దాన్ని విడిచిపోలేక అక్కడే స్థిరపడిపోయారు. వీరే మన ఆర్యులు. వీరు నివసించిన ఆభూభాగమే ఆర్యావర్తం. కాబట్టి ఆయా ప్రాంతాలలో నిలిచిపోయినా ఉభయులూ కలిసి ఒకే జాతికి చెందిన రెండు శాఖలు. ఉభయులకూ ఒకే భాష కూడా ఉండి తీరాలి. లేకపోతే నేటి పార్సీ భాషకూ, సంస్కృతానికీ ఇంత సన్నిహితమైన సాదృశ్యం ఉండటం కూడా అసంభవమే.
మొత్తానికి సింధు అనేది హిందూగా మారిందని చెప్పాము. సింధు అంటే ఏమిటి అర్థం? సింధు అంటే సంస్కృతంలో నది అని అర్ధం. గంగా యమున సింధు బ్రహ్మపుత్ర మొదలైన గొప్ప నదులు ప్రవహించే దేశం కాబట్టి దీనికి సింధు దేశం లేక హిందు దేశం అని పేరు వచ్చింది. ఆ తరువాత అది ఆ జాతికీ, ఆజాతి మాటాడే భాషకూ, వారి మతానికీ, సంస్కృతికీ క్రమంగా నామధేయమై ఉంటుంది.
Page 97